కరీమాబాద్, మార్చి 5 : ప్రభుత్వ సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఆదివారం 42వ డివిజన్లోని తెలంగాణ కాలనీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. డివిజన్లో పలు కాలనీల్లో తిరుగుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. వారి సమస్యలను విని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని డివిజన్లలో మౌలిక వసతులు కల్పిస్తానన్నారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని చెప్పారు. 6 ఏళ్లుగా తాము పడుతున్న సమస్యకు తెలంగాణ ప్రభుత్వం పరిష్కారం చూపడంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఖిలావరంగల్ పీఏసీఎస్ చైర్మన్ కేడల జనార్దన్, డివిజన్ అధ్యక్షుడు కర్ర కుమార్ పాల్గొన్నారు.
గిర్మాజీపేటలో..
గిర్మాజీపేట : గడపగడపకు కార్పొరేటర్ కార్యక్రమం ద్వారా 28వ డివిజన్లోని మేజర్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే నన్నపునేని అన్నారు. ఆదివారం కార్పొరేటర్ గందె కల్పనతో కలిసి సంతోషిమాత కాలనీ పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రేషన్ కార్డు ఉందా? పింఛన్ వస్తుందా? నీటి సరఫరా, లైటింగ్ సమస్యలపై ఆరా తీశారు. అనంతరం ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ యూనియన్ కాలనీ నిర్మాణానికి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నేత గందె నవీన్, నాయకులు కొలిపాక శ్రీనాథ్, మర్రి రవీందర్, బోయిని రవి, శంకర్సింగ్, కూకడపు దయాసాగర్, డప్పు దయాసాగర్గౌడ్, పాండు, శ్యామల సురేశ్, వల్లబోజు శ్రీనాథ్, శ్రీపతి శ్రీహరి, మల్లెబోయిన సత్యనారాయణ, మాధవి, జయశ్రీ పాల్గొన్నారు.
ముమ్మరంగా అభివృద్ధి పనులు..
పోచమ్మమైదాన్ : వరంగల్లోని 12, 13,18 డివిజన్లలో తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ బైక్పై పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి 15 మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, ఎల్బీనగర్లో బాధితుడికి రూ.48వేల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పేదింటి ఆడబిడ్డల పెళ్లికి కల్యాణలక్ష్మి పథకం ద్వారా ఆర్థికసాయం అందజేస్తున్నారన్నారు.
తూర్పు నియోజకవర్గాన్ని రూ.3800 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. రూ.1100 కోట్లతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రూ.75 కోట్లతో బస్ స్టేషన్, కలెక్టరేట్, మోడల్ కూరగాయల మార్కెట్, పండ్ల మార్కెట్, మాంసాహారానికి ప్రత్యేక మార్కెట్ల నిర్మాణం తదితర అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వివరించారు. గత పాలకులు ప్రజల కోసం ఏమీ చేయలేదని, ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో మళ్లీ ప్రజల వద్దకు వస్తున్నారని, వారికి తగిన బుద్ధి చెప్పాలని కోరారు. ఎమ్మెల్యే వెంట కార్పొరేటర్లు సురేశ్కుమార్ జోషి, కావటి కవితారాజుయాదవ్, వస్కుల బాబు ఉన్నారు.