ఖానాపురం, ఫిబ్రవరి 8: గ్రామాల్లో పెండింగ్లో ఉన్న పల్లెప్రగతి పనులను త్వరగా పూర్తి చేయాలని డీపీవో కటకం కల్పన అన్నారు. మంగళవారిపేటలో శ్మశాన వాటిక, డంపింగ్ యార్డు పనులను బుధవారం ఆమె పరిశీలించారు. అదేవిధంగా మన ఊరు-మన బడి కార్యక్రమంలో పాఠశాలల్లో చేపట్టిన పనులు, కంటి వెలుగు, జీపీ కార్యాలయంలో రికార్డులను ఆమె పరిశీలించారు. శ్మశాన వాటిక, డంపింగ్ యార్డు పనులు పూర్తి కాలేదన్నారు. పనుల్లో వేగం పెంచి వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో కార్యదర్శులతో డీపీవో సమీక్షించారు.
జూన్ నాటికి వందశాతం పూర్తి కావాలి
ఇంటి పన్నుల వసూలు 2018 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఏటా జూన్ నాటికి పూర్తి కావాలని డీపీవో కల్పన అన్నారు. కానీ, నేటికీ కొన్ని గ్రామాల్లో పూర్తి కాలేదని, వారం రోజుల్లో వందశాతం పూర్తి చేయాలని ఆమె కార్యదర్శులను ఆదేశించారు. గ్రంథాలయ పన్నులను జమ చేయని కార్యదర్శులు వెంటనే పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లో పారిశుధ్య పనులను రోజువారీగా కార్యదర్శులు యాప్లో అప్లోడ్ చేయాలన్నారు.
ప్రతి నెల 15లోగా జీపీకి సంబంధించిన విద్యుత్ చార్జీలు చెల్లించాలన్నారు. గ్రామాల్లో చిరువ్యాపారులు, కిరాణా వర్తకులకు ఆన్లైన్లో లైసెన్స్ జారీ చేయాలన్నారు. ప్రతి కార్యదర్శి నిత్యం గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. గ్రామాల అభివృద్ధిలో కార్యదర్శులదే ప్రధాన పాత్రని అని స్పష్టం చేశారు. ఆమె వెంట ఎంపీవో రవి, కార్యదర్శులు ఉన్నారు.