హనుమకొండ, జూలై : తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తి యువతకు ఆదర్శమని చీఫ్ విప్ దాస్యం వినయ్భాసర్ అన్నారు. మంగళవారం దొడ్డి కొమురయ్య 77వ వర్ధంతి సందర్భంగా హనుమకొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన చిత్రపటానికి కలెక్టర్ సిక్తా పట్నాయక్తో కలిసి చీఫ్విప్ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో తెలంగాణ పోరాట యోధులను స్మరించుకునేందుకు సమావేశ హాల్ కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాటి పోరాట యోధుల చరిత్రను భవిష్యత్తు తరాలకు తెలిసేలా ప్రభుత్వమే అధికారికంగా జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో పోరాడుతున్న వారిని చూసి అనేకమంది తెలంగాణ వస్తే ఏమి వస్తదంటూ హేళన చేసేవారని, కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అన్నివర్గాల సంక్షేమంతోపాటు అభివృద్ధి జరుగుతున్నదని నిరూపించినట్లు తెలిపారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ మహిళల పేరిట అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తి గురించి నాటి ఉద్యమకారుడు, నేటి సీఎం కేసీఆర్ అనేకసార్లు ప్రస్తావించేవారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో ఎ.శ్రీనివాస్కుమార్, బీసీ సంక్షేమ శాఖ అధికారి రాంరెడ్డి, టీజీవో జిల్లా అధ్యక్షుడు జగన్ మోహన్రావు, దొడ్డి కొమురయ్య ఫౌండేషన్ సభ్యులు, వివిధ కుల సంఘాల నాయకులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.