Telangana | స్వరాష్ట్రం అవతరించి తొమ్మిదేళ్లు పూర్తయి పదో ఏట అడుగుపెడుతున్నది. దేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ, నేడు దేశానికే ఆదర్శంగా నిలిచి దశాబ్ది వేడుకలకు ముస్తాబైంది. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ దిక్సూచి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సారథ్యంలో బంగారు తెలంగాణకు బాటలు పడి ఉద్యమ ఆకాంక్షలైన ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ నెరవేరి అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందరికీ అనుభవంలోకి వచ్చాయి. మన నీళ్లు మన పొలానికి పారుతున్నాయి. మన నిధులు సంక్షేమ పథకాల రూపంలో మన ఇంటికే అందుతున్నాయి. మన ఉద్యోగాలు మన వాళ్లకే దక్కుతున్నాయి. అన్నింటి కంటే ముఖ్యంగా కొత్త రాష్ట్రం తెలంగాణ ఇప్పుడు అభివృద్ధి, సంక్షేమం, వ్యవసాయం.. ఇలా అన్నింటిలోనూ దేశానికి దిక్సూచిగా నిలిచింది.
పరిపాలన చేరువై మారుమూల ప్రాంతాల్లోనూ ప్రగతి వెలుగులు విరజిమ్ముతున్నాయి. దశాబ్దాల ‘సమైక్య’ సంకెల తెంచుకొని దేశ అవనికపై కొంగొత్త రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ, నేటితో తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకుని, పదో ఏట అడుగిడుతున్నది. తన ‘దీక్షా’దక్షతతో స్వరాష్ట్రం సాధించిన కేసీఆర్, పాలనా పగ్గాలు చేపట్టిన ఈ తొమ్మిదేళ్లలో తెలంగాణ రాష్ట్రం ఎన్నో అద్భుతాలు సృష్టించింది.
వరంగల్, జూన్ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ వరంగల్, (నమస్తే తెలంగాణ)
పాలన చేరువై ప్రగతి పరవళ్లు
ప్రజలకు మెరుగైన పాలన అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామాలను పునర్విభజన చేసింది. ఉమ్మడి వరంగల్తోపాటు కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లోని మండలాల చేరికతో కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. రెవెన్యూ డివిజన్ల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఎన్నో పెద్ద గ్రామాలు మండలాలయ్యాయి. గిరిజన తండాలు ప్రత్యేక పంచాయతీలుగా మారాయి. పరిపాలన ప్రజల చెంతకు చేరింది. మారుమూల ప్రాంతాల్లోనూ ప్రగతి పరవళ్లు తొక్కుతున్నది. పరిపాలన కేంద్రాలు ఉత్తమంగా ఉండాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కేంద్రాల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఒక్క చోట ఉండేలా ఆత్యాధునిక భవనాలను నిర్మిస్తున్నది. హనుమకొండ, జనగామ, మహబూబాబాద్ జిల్లాల సమీకృత కార్యాలయ భవన నిర్మాణాలు పూర్తయ్యాయి. భూపాలపల్లిలో పనులు పురోగతిలో ఉన్నాయి. ములుగు, వరంగల్లోనూ నిర్మితం కానున్నాయి. శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖలోనూ పునర్విభజన చేసింది. కొత్తగా పోలీసు స్టేషన్లను, సర్కిళ్లను, డివిజన్ పోలీసు కార్యాలయాలను ఏర్పాటు చేసింది. స్వరాష్ట్రంలోనే వరంగల్ పోలీసు కమిషనరేట్ ఏర్పాటైంది.
సబ్బండవర్గాల సంక్షేమం..
ఆదాయం పెంచాలి, పేదలకు పంచాలనే విధానంతో పని చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఆసరా పథకంతో తొమ్మిది కేటగిరీల వారికి సామాజిక భద్రత కల్పిస్తున్నది. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, రైతు బంధు, రైతు బీమా అమలు చేస్తున్నది. చేపల పంపిణీ, గొర్రెల పంపిణీ వంటి పథకాలతో చేతి వృత్తులకు, కుల వృత్తులకు భరోసా కల్పిస్తున్నది. భూ రికార్డుల ప్రక్షాళన, ధరణి పోర్టల్ రెవెన్యూ చరిత్రలోనే కొత్త అధ్యాయంగా నిలిచాయి.
హెల్త్ హబ్ దిశగా..
తెలంగాణలో వరంగల్ను హెల్త్ హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. రాష్ట్రంలో ఏకైక హెల్త్ యూనివర్సిటీ వరంగల్లోనే ఉన్నది. తెలంగాణ కోసం పోరాడిన కాళోజీ నారాయణరావు పేరిట ఇది ఏర్పాటైంది. మొదటి నుంచీ వరంగల్ ఆరోగ్య సేవల విషయంలో కీలకంగా ఉంటున్నది. ఎంజీఎం, కేఎంసీలతో ప్రభుత్వ పరంగా ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలకు వైద్య సేవలు అందుతున్నాయి. దీనికి కొనసాగింపుగా సీఎం కేసీఆర్ కేసీఎం కాలేజీ ఆవరణలో ఇప్పటికే రూ.150 కోట్లతో 250 పడకల సామర్థ్యం కలిగిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించారు. తాజాగా ఎంజీఎంను మాతాశిశు సంరక్షణ (ఎంసీహెచ్)కేంద్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. సెంట్రల్ జైలు స్థానంలో రూ.1100కోట్లతో అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే పనులు 68శాతం పూర్తికాగా, నవంబర్లోగా అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పుడు ఎనిమిది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రాబోతున్నాయి.
దశాబ్ది ఉత్సవాలకు ముస్తాబు
తెలంగాణ అవతరించి తొమ్మిదేళ్లు పూర్తయి పదో ఏట అడుగిడుతున్న సందర్భంగాజూన్ 2నుంచి 22వరకు దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ నేపథ్యంలో ఉత్సవాల రోజువారీ కార్యక్రమాల షెడ్యూల్ను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందుకు సాగుతూ ఏర్పాట్లు చేస్తున్నారు. రాత్రివేళ ప్రభుత్వ కార్యాలయాలు విద్యుత్ వెలుగులతో జిగేల్మంటున్నాయి. నేడు జిల్లా కేంద్రాల్లో అతిథులు జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవవందనం స్వీకరించనున్నారు.
ప్రాజెక్టులతో సాగు భరోసా
మన దేశ జీవన విధానంగా ఉన్న వ్యవసాయంతోనే మన ఆర్థికానికి భరోసా. సమగ్ర వికాసం లక్ష్యంగా పని చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అలుపెరుగని కృషి చేసింది. ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యంగా మిషన్ భగీరథతో అన్ని చెరువులనూ బాగు చేసింది. దేశంలోనే అతిపెద్ద కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును అత్యంత వేగంగా పూర్తి చేసింది. ఎస్సారెస్పీ పునరుజ్జీవంతో ఆయకట్టుకు జీవం పోసింది. దేవాదుల, ఎస్సారెస్పీ పరిధిలో ఉండే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 14 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఊపిరిలూదింది. ఉమ్మడి జిల్లాకు అతి కీలకమైన తుపాకులగూడెం (సమ్మక్క) బరాజ్ నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసింది. అన్నదాతల పెన్నిధిగా ఉన్న సీఎం కేసీఆర్ సాగునీటితోపాటు వ్యవసాయానికి ఉచిత కరంటు అందిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కరంటు ఉత్పత్తిలో అగ్రగామిగా నిలిచింది. భూపాలపల్లిలో సీఎం కేసీఆర్ కొత్త కరంటు ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించారు. అన్నింటి కంటే ముఖ్యంగా రైతులకు పెట్టబడి కోసం ఉమ్మడి జిల్లాలో సుమారు రూ.900 కోట్లను రైతు బంధు పేరిట అందిస్తున్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేస్తూ భరోసా కల్పిస్తున్నారు.