నర్సంపేట, జూలై 20: బీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. నెక్కొండ, ఖానాపురం మండలాలకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు ఇటీవల మృతి చెందారు. వారి కుటుంబాలకు పార్టీ తరఫున మంజూరైన బీమా చెక్కులను ఒక్కొక్కరికి రూ. 2 లక్షల చొప్పున మొత్తం రూ. 4 లక్షల విలువైన చెక్కులను పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో గురువారం పెద్ది అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అభివృద్ధి కోసం పాటుపడుతున్న కార్యకర్తలకు బీఆర్ఎస్ ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. కార్యకర్తలు, నాయకులకు కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. ప్రమాదవశాత్తు మృతి చెందిన కార్యకర్తలకు రెండు లక్షల రూపాయల చొప్పున ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతోనే కార్యకర్తల కుటుంబాలకు భరోసా కల్పించేందుకు పార్టీ తరఫున బీమా చేయించారన్నారు. పార్టీ సాధారణ, క్రియాశీలక సభ్యత్వం కలిగిన సభ్యులకు బీమా వర్తిస్తుందన్నారు. ఖానాపురం మండలం వేపచెట్టుతండాకు చెందిన గుగులోత్ భిక్షపతి, నెక్కొండ మండలం నాగారానికిచెందిన కోటగిరి సుభాష్ ఇటీవల ప్రమాదవశాత్తు మరణించగా, వారి కుటుంబాలకు చెక్కులు అందించారు. కార్యక్రమంలో ఎంపీపీలు వేములపెల్లి ప్రకాశ్రావు, రమేశ్, జడ్పీటీసీ స్వప్న, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.
పేదలకు కార్పొరేట్ వైద్యం
నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పట్టణంలోని 9వ వార్డుకు చెందిన ఆలకుంట రవికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ. 1.50 లక్షల ఎల్వోసీని బాధితుడికి అందించారు. ఆరోగ్యశ్రీలో లేని జబ్బులకు బాధితులు ప్రైవేట్ దవాఖానల్లో వైద్యం పొందితే ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తున్నదన్నారు. రాజకీయాలకతీతంగా ఎంతో మంది ఆర్థిక సాయం పొందుతున్నారన్నారు. చాలామందికి సీఎం రిలీఫ్ ఫండ్ మెరుగైన వైద్యానికి చేయూతనిస్తున్నదన్నారు. కార్పొరేట్ దవాఖానల్లో వైద్య చికిత్సలు చేయించుకున్న వారు బిల్లులతో సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వారికి సీఎంఆర్ఎఫ్ నుంచి ఆర్థిక సాయం మంజూరవుతుందన్నారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ రాయిడి కీర్తి, బీఆర్ఎస్ యూత్ విభాగం పట్టణ అధ్యక్షుడు రాయిడి దుష్యంత్రెడ్డి, బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.