కాజీపేట, మే 27 : ప్రభుత్వ స్థలాల్లో కొన్నేళ్ల క్రితం ఇండ్లు నిర్మించుకున్న పేదలకు పట్టాలు ఇచ్చి హక్కులు కల్పించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. సోమిడిలో బాలయేసు (ఆర్సీఎం) చర్చి ఐదో వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించారు. బాలయేసు చర్చి శిథిలావవస్థకు చేరడంతో నూతన చర్చి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం సోమిడిలో ప్రభుత్వ భూముల్లో ఇండ్లు నిర్మించుకున్న పలువురికి జీవో 58 ప్రకారం పట్టాలను పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోమిడి ఎస్సీ కాలనీబాలయేసు మందిర నిర్మాణం పూర్తయ్యే వరకు అండగా ఉంటానన్నారు. పట్టణంలోని వైఎస్సార్ నగర్లో దాదాపు 20 ఏండ్ల క్రితం గుడిసెలు వేసుకుని నివాసముంటున్న పేదలకు పట్టాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని చెప్పారు. కాలనీ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ఈ నెల 31జరిగే కార్మిక మాసోత్సవ ముగింపు సభకు మంత్రి హరీశ్రావు ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ కిరణ్కుమార్, మాజీ కార్పొరేటర్లు రావుల సదానందం, సుంచు అశోక్, బీఆర్ఎస్ నాయకులు సుంచు కృష్ణ, కాటాపురం రాజు, పాలడుగుల శివకుమార్, బస్వ యాదగిరి, రామస్వామి, నయీమొద్దీన్, కుమ్మరి రాజ్కుమార్, సుంచు అశోక్కుమార్, నామిండ్ల సాయి కుమార్, మహమూద్, మల్లేశ్, సోని, మర్యాల కృష్ణ, సిరిల్ లారెన్స్, కొండ్ర శంకర్, వెంకన్న, సాంబయ్య, మాచర్ల ప్రభాకర్, అనిల్, నాగపురి విజయ, మేకల శంకర్ పాల్గొన్నారు.