వర్ధన్నపేట, జూలై 7 : గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.130 కోట్ల మేరకు నిధులను మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉందని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూ రి రమేశ్ తెలిపారు. శుక్రవారం ఎంపీపీ అన్నమనేని అప్పారావు అధ్యక్షతన జరిగిన వర్ధన్నపేట మండల సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టడం కోసం సర్పంచ్లు నిధు లు అడుగుతున్నారని ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి కోరినట్లు చెప్పారు. దీనికి సీఎం స్పందించి గ్రామ పంచాయతీలకు రూ.50 కోట్లు, పంచాయతీరాజ్శాఖ ద్వారా రూ.30 కోట్లు, ఎస్డీఎఫ్ ద్వారా మరో రూ.50 కోట్లను మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ నిధులతో త్వరలో ప్రణాళికల ప్రకారం పనులను ప్రారంభించనున్నట్లు చెప్పారు. అంతేకాక గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను సర్పంచ్లు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. నందనం గ్రామ సమీపంలోని జగ్గయగుండ్ల నుంచి ఇల్లంద వరకు లింకు రోడ్డుతో పాటు నల్లబెల్లి గ్రామం నుంచి అనంతా రం వరకు రోడ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.45 కోట్లను మంజూరు చేసినట్లు తెలిపారు. వీటితో పాటుగా పర్వతగిరి మండలంలోని పలు రోడ్లకు కూడా త్వరలోనే నిధులు మంజూరు కానున్నందున రహదారుల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో పంచాయతీ భవనాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. కొన్ని గ్రామాల్లో సర్పంచ్లు నిర్మాణాలను పూర్తి చేయడం లేదని, త్వరగా అన్ని నిర్మాణాలు పూర్తి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.
విద్యుత్శాఖ అధికారులపై ఆగ్రహం
విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది పనితీరుపై ఎమ్మెల్యే రమేశ్ మండల సభలో ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్శాఖ సమీక్షలో గ్రామాల్లో అదనపు విద్యుత్ స్తంభాలు, మిడిల్ స్తంభాలు కావాలని రెండేళ్లుగా కోరుతున్నా పనులు కావడంలేదని పలు గ్రామాల సర్పంచ్లు సభలో ఎమ్మె ల్యే దృష్టికి తీసుకొచ్చారు. అంబేద్కర్నగర్, బండౌతాపురం, ల్యాబర్తి, ఇల్లంద తదితర గ్రామా ల్లో అదనపు స్తంభాలు వేయాలని జీపీల నుంచి తీర్మానం చేసి ఇచ్చినా ఇంత వరకూ ఎలాంటి పురోగతి లేదని సర్పంచ్లు వివరించారు. దీంతో ఎమ్మెల్యే రమేశ్ ఏఈపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమైనా పెద్ద సమస్యలు ఉంటే తాను పరిష్కరిస్తానని, స్థానిక సమస్యలు కూడా పరిష్కరించకపోతే మీరెందుకు అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ప్రధానంగా వర్ధన్నపేటలో రహదారి పక్కన ఉన్న స్తంభాలను తొలగించి, కొత్త లైన్ ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్శాఖ ఉన్నతాధికారులతో పాటు వర్ధన్నపేట విద్యుత్ అధికారులు, సిబ్బందితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తానని చెప్పారు. అలాగే, మిషన్భగీరథ, పంచాయతీరాజ్, తదితర శాఖలపై ఎమ్మెల్యే సమీక్ష చేశారు.
ఇల్లంద పీహెచ్సీ ఏర్పాటుకు తీర్మానం
మండలంలోని ఇల్లంద గ్రామంలో పీహెచ్సీ ఏర్పాటు కోసం మండల సభలో ప్రత్యేక ఏకగ్రీవ తీర్మానం చేశారు. మండల ప్రజలకు పీహెచ్సీ లేకపోవడంతో వైద్య సేవలు పూర్తిస్థాయిలో అందడంలేదు. ఇల్లందలో పీహెచ్సీని ఏర్పాటు కోసం ప్రత్యేక భవనాన్ని కూడా కేటాయించారు. అందుకని విధిగా వర్ధన్నపేట మండలానికి ప్రత్యేక పీహెచ్సీని మంజూరు చేసి ఇల్లందలో కేటాయించిన భవనంలో ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే రమేశ్ సమక్షంలో మండల సభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని కలెక్టర్కు అందివ్వనున్నట్లు అధికారులు తెలిపారు. సమావేశంలో జడ్పీటీసీ మార్గం భిక్షపతి, వైస్ ఎంపీపీ చొప్పరి సోమలక్ష్మి, పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్ఖన్నా, ఎంపీడీవో రాజ్యలక్ష్మి, వివిధ శాఖల అధికారులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
పేదలకు అండగా సీఎంఆర్ఎఫ్
ఆర్థిక ఇబ్బందులకు గురయ్యే పేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తున్నదని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 34 మంది లబ్ధిదారులకు రూ.10.20లక్షల చెక్కులను క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో వేలాది కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ అండగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోత్ అరుణ, ఏఎంసీ చైర్మన్ స్వామిరాయుడు, పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్ఖన్నా, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.