వరంగల్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కష్ట కాలంలో పార్టీని కాపాడుకున్నవారిపైనే కాంగ్రెస్ అధిష్టానం భస్మాసుర ‘హస్తం’ పెట్టిందని ఆ పార్టీ టికెట్ ఆశించి భంగపడినవారిలో అసంతృప్తి భగ్గుమంటున్నది. ఎప్పటినుంచో ఉన్నవాళ్లను కాదని, నిన్నమొన్న చేరిన వారికి టికెట్లు ఎలా ఇస్తారంటూ తీవ్రస్థాయిలో అసమ్మతి రేగుతున్నది. కాంగ్రెస్ రెండో జాబితా ప్రకటన అనంతరం ఎక్కువ స్థానాల్లో కలకలం రేగింది. నిరసనలు, నినాదాలు, వ్యతిరేక నిర్ణయాలు, రాజీనామాలు కొనసాగుతున్నాయి. ‘24గంటల్లోగా టికెట్ కేటాయించకుంటే తాడోపేడో తేల్చుకుంటాం.. అవసరమైతే స్వతంత్రంగా బరిలోకి దిగుతా’మని అల్టిమేటం జారీ చేసేదాకా పరిస్థితి వెళ్లింది.
కాంగ్రెస్ రెండో విడుత జాబితా విడుదల అనంతరం హస్తం పార్టీలో అసంతృప్తి సెగలు మరింత ఎగిసిపడుతున్నాయి. వారం క్రితం పార్టీలో చేరినవారికి టిక్కెట్లు ఇవ్వడంపై ఏండ్ల తరబడి పార్టీకోసం పనిచేస్తూ వచ్చిన నాయకులు భగ్గుమంటున్నారు. వరంగల్ పశ్చిమం, పరకాల, హుస్నాబాద్లో అసమ్మతి తీవ్ర స్థాయిలో ఉన్నది. ఇక్కడ టిక్కెట్ ఆశించిన ముఖ్యనేతలు తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలో నిలిచేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. శనివారం తమ అనుచరులతో సమావేశాలు నిర్వహించారు. కార్యకర్తల సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాంగ్రెస్ తమను మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. వర్ధన్నపేట, మహబూబాబాద్, పాలకుర్తిలోనూ అసమ్మతులు మొదలయ్యాయి. టిక్కెట్ రాని నేతలు అంతర్గతంగా సమావేశాలు నిర్వహించుకుంటున్నారు.
ఇనగాల సొంత దారి
కాంగ్రెస్ పార్టీ నిర్ణయంపై ఇనగాల వెంకట్రాంరెడ్డి తిరుగుబాటు జెండా ఎగురవేశారు. పదేండ్లుగా పార్టీ కోసం పని చేస్తున్న తనకు అవకాశం ఇవ్వలేదని వాపోయారు. వారం క్రితం పార్టీలో చేరిన నర్సంపేట నియోజకవర్గ నేత రేవూరి ప్రకాశ్రెడ్డికి ఇక్కడ టిక్కెట్ ఇవ్వడమేమిటని నిలదీస్తున్నారు. తన అనుచరులతో సమావేశమై ఎట్టి పరిస్థితుల్లోనూ బరిలో ఉండేలా కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. పరకాల టికెట్ దక్కిన రేవూరి శనివారం ఉదయం ఇనగాలను కలిసేందుకు వెళ్లగా ‘రేవూరి గో బ్యాక్’ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఇనగాల అనుచరుల హెచ్చరికలతో రేవూరి అక్కడి నుంచి వెళ్లిపోయారు. వరంగల్, హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణ, నాయిని రాజేందర్రెడ్డి ఇనగాల ఇంటికి వెళ్లి చర్చించారు. కాంగ్రెస్ అధిష్టానానికి అంతా నివేదిస్తామని చెప్పారు. అనంతరం వెంకట్రాంరెడ్డి కార్యకర్తలతో సమావేశమయ్యారు.
అల్గిరెడ్డి తిరుగుబాటు
హుస్నాబాద్ టిక్కెట్ స్థానికులకు కాకుండా కరీంనగర్కు చెందిన పొన్నం ప్రభాకర్కు ఇవ్వడంపై మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డి తిరుగుబాటు మొదలుపెట్టారు. ప్రవీణ్రెడ్డికి టిక్కెట్ రాలేదనే సమాచారం తెలిసి నియోజకవర్గంలోని కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో శనివారం ఆయన ఇంటికి వచ్చారు. కాంగ్రెస్ తనను నమ్మించి మోసం చేసిందని ప్రవీణ్రెడ్డి మండిపడ్డారు. తడిగుడ్డతో గొంతు కోసిందని ఆవేదన చెందారు. హుస్నాబాద్ ఆత్మగౌరవాన్ని వదిలేది లేదని చెప్పారు. హుస్నాబాద్ టిక్కెట్ దక్కిన పొన్నం ప్రభాకర్ శనివారం ఉదయం ప్రవీణ్రెడ్డి ఇంటికి వెళ్లారు. ఎన్నికల్లో తన గెలుపు కోసం సహకరించాలని కోరగా ఆయన విజ్ఞప్తిని ప్రవీణ్రెడ్డి సున్నితంగా తిరస్కరించారు. అనంతరం ప్రవీణ్రెడ్డి కార్యకర్తలతో సమావేశమయ్యారు.
కేయూ ఉద్యమకారుల ఆగ్రహం
కాంగ్రెస్ టిక్కెట్ల కేటాయింపులో కేయూ ఉద్యమకారులకు, బీసీలకు అన్యాయం జరిగిందని కేయూ ఉద్యమకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేసి తమ నిరసన తెలిపారు. టిక్కెట్ల కేటాయింపులో కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేసిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్రవర్ణాలకు ప్రాధాన్యమిస్తున్న కాంగ్రెస్, ఈ ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించక తప్పదని మండిపడ్డారు.
పశ్చిమ బరిలో జంగా
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో టిక్కెట్ ఆశించిన డీసీసీబీ మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అధిష్టానం నిర్ణయంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తమ అనుచరులు, కార్యకర్తలతో సమావేశమై వరంగల్ పశ్చిమంలో కచ్చితంగా పోటీలో ఉండే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రెండు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు. ‘యుద్ధానికి ఆయుధంతో సిద్ధంగా ఉన్న. ప్రజలు నన్ను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. కొత్తగా వచ్చిన రేవూరికి, నాగరాజుకు, యశస్వినికి టికెట్లు ఇచ్చారు. నాకు మాత్రం ఇవ్వలేదు. పార్టీ మీటింగ్స్కు కోట్ల రూపాయలు ఖర్చు చేశా. నాపై కుట్ర చేసి, ఒక అసమర్థునికి టికెట్ ఇచ్చారు.’ అంటూ మండిపడ్డారు. అవసరమైతే ఏదో ఒక పార్టీ మద్దతు తీసుకొని ఒకట్రెండు రోజుల్లో తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు.