కిడ్నీ బాధితులకు రాష్ట్ర సర్కారు అండగా నిలుస్తున్నది. ఖరీదైన వైద్యాన్ని పేదలకు ఉచితంగా అందిస్తున్నది. ఏటూరునాగారంలోని డయాలసిస్ సెంటర్ బాధితుల ప్రాణాలను నిలుపుతున్నది. ఈ ప్రాంత వాసులు ఒకప్పుడు డయాలసిస్ చేయించుకోవాలంటే వరంగల్ లేదా హైదరాబాద్లోని ప్రైవేట్ దవాఖానలను ఆశ్రయించాల్సి వచ్చేది. దీంతో పేదలపై ఆర్థిక భారం పడేది. ఇటీవల సీఎం కేసీఆర్ వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన సందర్భంలో ఇక్కడ డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు రెండు నెలల్లోనే అందుబాటులోకి తెచ్చారు. దీంతో మారుమూల గ్రామాల ప్రజలకు సైతం డయాలసిస్ సేవలు చేరువై వ్యవ ప్రయాసలు తగ్గాయి.
ఏటూరునాగారం, డిసెంబర్ 26: ఒకప్పుడు కిడ్నీ వ్యాధిగ్రస్తులు డయాలసిస్ కోసం 100 నుంచి 150 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వచ్చేది. దీంతో నిరుపేద కిడ్నీ బాధితులపై ఆర్థిక భారం పడి అప్పులు పాలయ్యారు. సీఎం కేసీఆర్ వరద ముంపు ప్రాంత సందర్శనలో భాగంగా జూలై 17న ఏటూరునాగారం వచ్చినపుడు డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు ఇచ్చిన హామీ రెండు నెలలకే అమల్లోకి వచ్చింది. అక్టోబర్ 1న ఏటూరునాగారంలో సెంటర్ను ఏర్పాటు చేయడంతో పేదలకు కొండంత భరోసా కలిగింది. గతంలో 120 నుంచి 150 కిలోమీటర్ల దూరం వెళ్లే రోగులంతా అత్యంత సమీపంలో ఉన్న సెంటర్లో చికిత్స పొందుతున్నారు. రూపాయి ఖర్చు లేకుండా ఆరోగ్య శ్రీ కింద చికిత్సను మంజూరు చేస్తున్నారు. ఇక డయాలసిస్ సైక్లింగ్ను ఉచితంగా చేస్తున్నారు.
రోగులపై భారం పడకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. మారుమూల ప్రాంతాల రోగులకు డయాలసిస్ సెంటర్ వరంగా మారింది. రోగులకు వ్యయప్రయాసలు పూర్తిగా తగ్గాయి. డయాలసిస్ కోసం డబ్బులు లేక హనుమకొండకు వెళ్లడం మానుకున్న వారు కూడా ఇక్కడ చికిత్స పొందుతున్నారు. ఏటూరునాగారం, తాడ్వాయి, గోవిందరావుపేట, వాజేడు, వెంకటాపురం, మంగపేట, కన్నాయిగూడెం మండలాలకు చెందిన రోగులు ఈ సెంటర్లో నిత్యం చికిత్స పొందుతున్నారు.
వారానికి రెండు, మూడు సార్లు డయాలసిస్ కోసం వస్తున్నారు. అందుబాటులో ఉండడం వల్ల ద్విచక్ర వాహనాలపై వచ్చి చికిత్స పొంది వెళుతున్నారు. గతంలో హనుమకొండలోని ప్రైవేటు వైద్యశాలకు వెళ్లి రావడానికి రోజు పట్టేది. అంతే కాకుండా వెళ్లి రావడానికి చార్జీలతో పాటు ఇతర ఖర్చులు ఎక్కువ అయ్యేవి. వేల రూపాయల ఖర్చు నుంచి రూ. 200లు కూడా దాటకుండా రోగులు ఇక్కడి సెంటర్ సేవలు పొందుతున్నారు. ఏటూరునాగారంలో డయాలసిస్ సెంటర్ను అక్టోబర్ 1వ తేదీన ప్రారంభించారు. ఇన్నాళ్లూ ఈ చికిత్స కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసిన వారికి భరోసానిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం సెంటర్ను ఏర్పాటు చేసి తమను ఆర్థికంగా ఆదుకుంటున్నదని డయాలసిస్ బాధితులు పేర్కొంటున్నారు.
మూడు నెలల్లో 183 సెషన్లు..
డయాలసిస్ సెంటర్లో మూడు బెడ్స్ను ఏర్పాటు చేశారు. దీంతో ఒకేసారి ముగ్గురికి చికిత్స అందించే అవకాశం ఉంది. ఒక్కో రోగికి వారానికి రెండు, మూడు సార్లు డయాలసిస్ చేస్తున్నారు. ప్రైవేటుగా ఒకసారి చేయిస్తే రూ.3వేల వరకు ఖర్చు అవుతుంది. ఒకసారి రోగికి ఆరోగ్య శ్రీ కింద 10 సెషన్లకు అనుమతి లభిస్తుంది. ఇందుకు రూ. 13,750 మంజూరు చేస్తారు. తర్వాత మళ్లీ అనుమతి పొందాల్సి ఉంటుంది. ప్రస్తుతం 11 మంది కిడ్నీ బాధితులు చికిత్స పొందుతున్నారు. వీరంతా ఏటూరునాగారం పరిసర మండలాలకు చెందిన వారే. అక్టోబర్లో 20, నవంబర్లో 96, డిసెంబర్లో 22వ తేదీ వరకు 67 సెషన్లు చేసినట్లు టెక్నీషియన్ పేర్కొంటున్నారు.
డయాలసిస్ కోసం 140 కిలోమీటర్లు పోయిన..
ఏటూరునాగారంలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడం వల్ల 110 కిలోమీటర్ల దూరం తగ్గింది. మంగపేట మండలం బాలన్నగూడెం నుంచి మూడు నెలలకుగా హనుమకొండలోని ప్రైవేట్ దవాఖానకు వెళ్తున్నా. వారానికి రెండు సార్లు చొప్పున ప్రతీ సారి పోయినపుడు రూ.1300 ఖర్చు అయ్యేది. చికిత్స తర్వాత ఒక్కోసారి రాత్రి 2 గంటలకు ఇంటికి చేరుకునేది. ఏటూరునాగారంలో ఏర్పాటు చేసిన తర్వాత రూ.200 కూడా ఖర్చు కావడం లేదు. చికిత్స కోసం రోజు విడిచి రోజు వస్తున్నా.
– యాలం మునయ్య, డయాలసిస్ పేషెంట్, బాలన్నగూడెం, మంగపేట మండలం
ప్రతిరోజు పేషెంట్లు వస్తున్నారు..
ఆరు సంవత్సరాలుగా టెక్నీషియన్గా పనిచేస్తున్నా. పట్టణంలో పనిచేసే తనకు మారుమూల ప్రాంతంలోని రోగులకు సేవలు అందించే అవకాశం రావడం అదృష్టం. ఇక్కడ అన్ని వసతులు ఏర్పాటు చేశారు. రోగులు కూడా డయాలసిస్ సమయంలో సహకరిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 9 నుంచి రాత్రి 8 గంటలకు వరకు వైద్యశాలలో అందుబాటులో ఉంటున్నాం. ఇద్దరం టెక్నీషియన్లం ఉన్నాం. కార్పొరేట్ వైద్యశాలల తరహాలో సెంటర్ ఉంది. అత్యవసరమైతే రోగులను వరంగల్ తరలిస్తున్నాం.
– అక్కపాక శశి, డయాలసిస్ టెక్నీషియన్, ఏటూరునాగారం
కార్పొరేట్ తరహాలో డయాలసిస్ సెంటర్..
కిడ్నీ వ్యాధిగ్రస్తులకు కార్పొరేట్ తరహాలో వైద్యసేవలు అందిస్తున్నాం. రోగుల పట్ల పూర్తి పర్యవేక్షణ ఉంటుంది. అత్యవసరమైతే పక్కనే ఉన్న వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తాం. కిడ్నీ సమస్య ఎక్కువగా ఉంటే వరంగల్ పంపించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. రోజుకు కనీసం ఆరు సెషన్లు అవుతున్నాయి. పూర్తి ఉచితంగా డయాలసిస్ చేస్తున్నాం. డయాలసిస్కు అవసరమైన కిట్స్ కూడా ఉచితంగా అందిస్తున్నాం. ఇద్దరు టెక్నీషియన్లు, పూర్తి స్థాయిలో వసతులు ఉన్నాయి.
– ఎం సురేశ్కుమార్, సూపరిండెంటెంట్, సామాజిక వైద్యశాల, ఏటూరునాగారం