వర్ధన్నపేట, మార్చి 2 : కార్పొరేట్ సంస్థలకు ప్రాధాన్యమిస్తూ నిత్యావసర సరుకుల ధరలను విపరీతంగా పెంచుతూ పేదలపై కేంద్ర ప్రభుత్వం పెనుభారం మోపుతున్నదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం గ్యాస్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ నియోజకవర్గ కేంద్రంలో డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, ఐదు మండలాలకు చెందిన పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులతో కలిసి గురువారం ధర్నా చేపట్టారు.
అంబేద్కర్ సెంటర్లో ఏర్పాటు చేసిన నిరసన శిబిరం ఎదుట కట్టెలపొయ్యిపై వంట చేసి నిరసన అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదలకు న్యాయం చేయడం లేదని మండిపడ్డారు. కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే బీజేపీ ప్రయత్నిస్తున్నదన్నారు. మూడు రాష్ర్టాల్లో ఎన్నికలు అయిపోగానే మరో సారి వంటగ్యాస్ ధరలను పెంచిందని తెలిపారు. ప్రజల కోసం పనిచేస్తున్న బీఆర్ఎస్, ముఖ్యమంత్రి కేసీఆర్పై అర్థంలేని ఆరోపణలు, విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్రం పెంచిన ధరలతో పేద, మధ్యతరగతి కుటుంబాల ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్న కేంద్రానికి వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీలు అన్నమనేని అప్పారావు, మార్నేని మధుమతి, జడ్పీటీసీలు గజ్జెలి శ్రీరాములు, మార్గం భిక్షపతి పాల్గొన్నారు.
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం..
పర్వతగిరి : పేద ప్రజల సంక్షేమమే సీఎం కేసీఆర్ ప్రధాన ధ్యేయమని ఎమ్మెల్యే అరూరి అన్నారు. పర్వతగిరిలో కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో పేదలకు లబ్ధి చేకూరుతుందన్నారు. మండలంలోని 20 మందికి రూ. 20 లక్షల 2 వేల 320 విలువైన చెక్కులను అందించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కోమీ, ఎంపీడీవో చక్రాల సంతోష్కుమార్, మనోజ్కుమార్గౌడ్, ఎంపీపీ కమ ల, వైస్ ఎంపీపీ రాజేశ్వర్రావు, సర్పంచ్ మాలతీసోమేశ్వర్రావు, ఎంపీటీసీ లావణ్యారావు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులను పూర్తి చేయాలి..
న్యూశాయంపేట : గ్రామాల్లో అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని ఎమ్మెల్యే అరూరి రమేశ్ పేర్కొన్నారు. పర్వతగిరి మండల ప్రజా ప్రతినిధులు, అధికారులతో హనుమకొండ హంటర్రోడ్డులోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై ప్రజలకు వివరించాలని సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సింగ్లాల్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఏకాంతంగౌడ్, మనోజ్కుమార్గౌడ్, వైస్ ఎంపీపీ రాజేశ్వర్రావు, గొర్రె దేవేందర్, ఎండీ సర్వర్, యుగేంధర్రావు, మేడిశెట్టి రాములు, జితేందర్రెడ్డి, నారాయణరావు, భాస్కర్రావు, రంగు కుమార్గౌడ్, పంతులు, శ్రీనివాస్ పాల్గొన్నారు.