వరంగల్ చౌరస్తా, డిసెంబర్29: ‘మహాలక్ష్మీ పథకంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో మా కుటుంబాలు రో డ్డున పడ్డాయ్.. ఆదుకోవాలని చేతులెత్తి మొక్కుతున్నాం’ అని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా ఆర్టీసీ బస్టాండ్లు, డిపోల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించాలన్న ఐక్య కార్యాచరణ కమిటీ తీర్మానం మేరకు వరంగల్ బస్టాండ్ ఎదుట ధర్నా చేశారు. బస్టాండ్ వద్ద బస్సుల రాకపోకలు సాగకుండా అడ్డుకొని ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ధర్నా విరమించాలని ఆటోడ్రైవర్లకు నచ్చజెప్పినా వినకపోవడంతో వారిని అరెస్టు చేశారు. అనంతరం ఇంతేజార్గంజ్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా ఆటో డ్రైవర్స్ యూనియన్స్ ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యుడు ఈసంపల్లి సంజీవ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఏ మహిళా కోరని ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టి ఆటో డ్రైవర్ల కుటుంబాలను రోడ్డున పడేసిందన్నారు. యూనియన్ నాయకులు ఈసంపల్లి సంజీవ, మంద శ్రీధర్రెడ్డి, మడికొండ బాబు, కలకోట్ల జయ రాం, బొల్లం సంజీవ్, బోల్ల ఈశ్వర్, ఎస్కే అమీరుద్దీన్లపై కేసు నమోదు చేసి, సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.