హనుమకొండ, ఏప్రిల్ 21 : ఉమ్మడి వరంగల్ ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారని ఆ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. ఆదివారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ మారెపల్లి సుధీర్కుమార్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. పదేళ్లలో బీజేపీ తెలంగాణకు చేసిందేమీ లేదని.. ఈ ప్రాంత ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్, బీజేపీలకు ఈ ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పేందుకు వారు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. విభజన చట్టంలో పొందుపరిచిన కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వడంలో బీజేపీ విఫలమైందన్న దాస్యం, ప్రస్తుత పరిస్థితులు బీఆర్ఎస్కే అనుకూలంగా ఉన్నాయని, వరంగల్ పార్లమెంట్పై గులాబీ జెండా ఎగరడం ఖాయం అని చెప్పారు.
తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తే.. బీజేపీ ధోకా చేసింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య, బీజేపీ అభ్యర్థి అరూరి రమేశ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వర్ధన్నపేట ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గం చుట్టూ ఉన్న భూములను ఆక్రమించిన అరూరి రమేశ్ ఓ భూకబ్జాదారుడు. రేపు ఎంపీగా గెలిపిస్తే వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం చుట్టూ ఉన్న భూములు కూడా ఆక్రమిస్తాడు. ప్రతి ఒకరూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషిచేసిన భారత రాష్ట్ర సమితి పార్టీకి ఓటు వేసి గెలిపించాలి. బీజేపీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదు. పేదల నడ్డివిరుస్తూ కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తున్నది. మోదీ భారత దేశానికి ప్రధానా, గుజరాత్ రాష్ర్టానికా అనే అనుమానం ప్రజల్లో ఉన్నది. తెలంగాణకు ఒక వైద్య కళాశాల కూడా మంజూరు చేయలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ విష ప్రచారం చేస్తున్నది. మరమ్మతులు చేయకుండా రైతాంగాన్ని ఇబ్బందులు పెడుతున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో విడుదల చేసిన నోటిఫికేషన్లకు ఉత్తర్వులు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పడం విడ్డూరంగా ఉంది. సమావేశంలో కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు వాసుదేవరెడ్డి, సుందర్రాజు యాదవ్, మర్రి యాదవరెడ్డి, రైతు కో ఆర్డినేటర్ ఎల్లావుల లలితాయాదవ్, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కో ఆర్డినేటర్ పులి రజినీకాంత్, బీఆర్ఎస్ నాయకులు, ఉద్యమకారులు జోరిక రమేశ్, బి.వీరేందర్, చింతల యాదగిరి, రవీందర్రావు, పరశురాములు, మైనార్టీ నాయకుడు నయీముద్దీన్, డివిజన్ అధ్యక్షులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ పార్టీ ప్రొడక్టును కాంగ్రెస్, బీజేపీలు కొనుగోలు చేశాయి. ప్రజలు ఎప్పుడూ కూడా ధర్మానికే ఓటు వేసి అధర్మాన్ని ఓడిస్తారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ధర్మమే గెలుస్తుంది. వరంగల్ పార్లమెంట్ బరిలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్లిన వారే. అవకాశవాద రాజకీయాలను వరంగల్ ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే వారికి గుణపాఠం చెబుతారు.
బీఆర్ఎస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ మారపెల్లి సుధీర్కుమార్ సోమవారం నామినేషన్ వేయనున్నారు. ఉదయం 10గంటలకు బాలసముద్రంలోని పార్టీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీగా వరంగల్ కలెక్టరేట్ వరకు వెళ్లి ఉదయం 11గంటలకు నామినేషన్ దాఖలు చేస్తారు. బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దాస్యం పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఈ నెల 23న వరంగల్కు రానున్నారు. మంగళవారం సాయంత్రం వరంగల్లోని నాని గార్డెన్లో జరిగే వరంగల్ తూర్పు, హంటర్రోడ్డులోని డీ కన్వెన్షన్లో జరిగే వర్ధన్నపేట నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాలకు కేటీఆర్ హాజరవుతారని దాస్యం తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో బీఆర్ఎస్ పార్టీ మొదటి స్థానానికి వచ్చి, కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితమైంది. అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు జరిగిన అన్యాయంతోనే ఉద్యమం పుట్టుకొచ్చింది. త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణలో సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు ఏ ఒక్కరోజూ జై తెలంగాణ అనలేదు. ఆనాడు ఆరు సూత్రాలు అని ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆరు హామీల పేరుతో మరో కుట్రకు తెరతీసింది. 610 జీవోతో ప్రారంభమైన ఉద్యమాల ఫలితమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాతే బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసింది. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో, కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. గొడవలు పెంచడం, ప్రజలను వంచించడం కాంగ్రెస్ పార్టీ నైజం. విభజన చట్టంలోని హామీలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తుంగలో తొక్కింది. తెలంగాణ ప్రజలను మోసం చేసే వారిని గుణపాఠం తప్పదు.