గజ్జెల లాగులు.. ఢమరుక నాదాలు.. డోలు చప్పుళ్లు.. అర్చకుల పూజలు.. ఒగ్గు పూజారుల పట్నాలు.. పోతరాజుల విన్యాసాలు.. మహిళల బోనాల సమర్పణతో సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లన్న క్షేత్రం పులకించిపోయింది. ఆదివారం పట్నం వారంతో క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. మల్లన్న నామస్మరణతో క్షేత్రం పరవశించింది.
చేర్యాల, జనవరి 21: కొమురవెల్లి మల్లన్న ఉత్సవాలు పట్నం వారంతో ఆదివారం వైభవంగా ప్రారంభం కాగా.. 75వేల మంది భక్తులు తరలివచ్చారు. బ్రహ్మోత్సవాల్లో మొదటి వారం పట్నం వారంగా పిలువడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ క్రమంలో భక్తులు పెద్దసంఖ్యలో వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం చిలుక పట్నం, గంగరేగు చెట్టు వద్ద నజరు పట్నం, మహామండపంలో ముఖమండప పట్నాలు వేసి మొక్కులు తీర్చుకున్నారు. చేర్యాల, సిద్దిపేట, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, జనగామ తదితర జిల్లాల నుంచి భక్తులు ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో భారీగా కొమురవెల్లి క్షేత్రానికి తరలివచ్చారు.
హైదరాబాద్ ఒగ్గు పూజారుల సంఘం ఆధ్వర్యంలో భక్తులు మల్లన్న క్షేత్రంలోని కల్యాణ వేదిక వద్ద సోమవారం పెద్దపట్నం వేసి అగ్నిగుండం తయారు చేయనున్నారు. పట్నం వారానికి వచ్చిన భక్తులు పెద్దపట్నం, అగ్నిగుండం దాటి స్వామివారిని మరోసారి దర్శించుకుంటారు. అనంతరం నల్లపోచమ్మ, కొండపోచమ్మ ఆలయాలకు వెళ్లి అక్కడ అమ్మవార్లకు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు.