తాడ్వాయి, జనవరి 26: మేడారం సమ్మక్క-సారలమ్మల సన్నిధికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. వనదేవతల మహా జాతరకు మరికొద్ది రోజుల సమయం ఉన్నప్పటికీ ముందస్తుగా భక్తులు మొక్కు లు చెల్లించుకునేందుకు కుటుంబ సమేతంగా మేడారం చేరుకొని భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, మహారాష్ట్ర ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ర్టాల నుంచి సైతం వాహనాల్లో మేడారం చేరుకున్నారు. ఉదయం నుంచి జంపన్నవాగు వద్దకు భక్తులు అధికసంఖ్యలో చేరుకొని పవిత్రస్నానాలు ఆచరించి తలనీలాలను సమర్పించి తల్లుల గద్దెల వద్దకు చేరుకొంటున్నారు. ఎత్తుబెల్లం, పసుపు, కుంకుమ, సారె, పూలు, పండ్లు, ఒడిబియ్యం సమర్పించి గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. వనదేవతల దర్శనానికి భక్తులు పోటెత్తడంతో అడిషనల్ కలెక్టర్ శ్రీజ గద్దెల పరిసరాలను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.
మేడారం మహాజాతర అభివృద్ధి పనుల్లో వేగం పెంచి గడువులోపు పూర్తి చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. శుక్రవారం జాతర పరిసరాలను ఆకస్మికంగా తనిఖీ చేసి, పనుల పురోగతిని పరిశీలించారు. వీఐపీ, వీవీపీ పార్కింగ్ స్థలాలు, రోడ్లను, పీఆర్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న సీసీ రోడ్లతో పాటు పార్కింగ్ స్థలాలను కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. అనంతరం జంపన్నవాగులో బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ ఏర్పాట్లు, తాత్కాలిక గదులను పరిశీలించి త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా శ్రద్ధతో చేయాలని, నాణ్యతా ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని సూచించారు.