వరంగల్, అక్టోబర్ 17 : దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు కనులపండువగా కొనసాగుతున్నాయి. నగరంలోని ప్రసిద్ధ భద్రకాళీ దేవాలయంలో ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు మంగళవారం భద్రకాళీ అమ్మవారు గాయత్రీ మాతా అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. తెల్లవారుజామున అర్చకులు నిత్యహ్నికం నిర్వహించిన అనంతరం అమ్మవారిని గాయత్రీ మాతాగా అలంకరించారు. ఉదయం చద్రఘంటా క్రమంలో సింహ వాహనసేవ నిర్వహించారు. సాయంత్రం మహిషాసురమర్ధిని దుర్గా క్రమంలో గజ వాహన సేవపై ఊరేగించారు. గాయత్రీమాతా అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సాయంత్రం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో మహాన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఈవో శేషుభారతి పర్యవేక్షిస్తున్నారు. నగరంలోని పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు.
నగరంలోని ఎంజీఎం సెంటర్ ఉన్న రాజరాజేశ్వరీ ఆలయంలో ఉత్సవాల్లో భాగంగా రోహిణి అలంకరణలో రాజరాజేశ్వరీ దేవీ భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తొమ్మిది రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
హనుమకొండ : హనుమకొండ పద్మాక్షి కాలనీలోని శ్రీ హనుమద్గిరి పద్మాక్షి దేవాలయంలో దేవీ శరన్నవరాత్రుల మహోత్సవాలు జరుగుతున్నాయి. మూడో రోజు పద్మాక్షి అమ్మవారు చంద్రఘంటా అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో భాగంగా ఉదయం అమ్మవారికి అభిషేకం నిర్వహించి, అలంకరించినట్లు అర్చకుడు నాగిళ్ల శంకర్శర్మ, ఆస్థాన వేద పండితుడు నాగిళ్ల షణ్ముక పద్మనాభ అవధాని తెలిపారు.
హనుమకొండ చౌరస్తా : వేయిస్తంభాల దేవాలయంలో రుద్రేశ్వరీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలను మూడో రోజు ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, గాయత్రిదేవిగా అలంకరించారు. మారేడుదళ బిల్వార్చన అనంతరం జింక వాహనంపై పల్లకీసేవ నిర్వహించినట్లు ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. యాగశాలలో ఆధ్యాత్మికవేత్త అనిల్కుమార్, రమేశ్ ఉభయదాతలుగా చండీహోమం నిర్వహించారు. సీఎంఆర్ షాపింగ్మాల్ సౌజన్యంతో భక్తులకు అన్నదానం చేశారు. సాయంత్రం ఝాన్సీ శిష్యబృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించారు. ఈవో కే వెంకటయ్య కార్యక్రమాలను పర్యవేక్షించారు. కార్యక్రమాల్లో రుద్రేశ్వరసేవాసమితి సభ్యులు కోన శ్రీఖర్, గండ్రాతి రాజు, పులి రజినీకాంత్, పల్లం రమేశ్, కిషన్లాల్, మంత్రి ఇంద్రకరణ్రెడ్డి బంధువులు, పారిశ్రామికవేత్త పొద్దుటూరి రామేశ్వర్రెడ్డి బంధువులు పాల్గొన్నారు.