హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 19: నగరంలో దేవీ శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. చారిత్రక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో ఐదో రోజు గురువారం శ్రీరుద్రేశ్వరీదేవిని శ్రీలలితా మహాత్రిపుర సుందరిగా అలకరించారు. ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధార్మికవేత్తలు నీలం సుహాస్ దంపతులు, పీ కిశోర్ దంపతులు ఉభయదాతలుగా విజయవాడ నుంచి తెప్పించిన లిల్లీ, చామంతి, గులాబీ, మల్లె, గన్నెరు, సంపంగి పూల తో లలితాసహస్త్రనామాలతో వేదోక్తంగా లక్షపుష్పార్చన నిర్వహించినట్లు ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. అనంతరం లలితా త్రిపురసుందరిని సూర్యవాహనంపై ఊరేగించినట్లు పేర్కొన్నారు. గణపతి నవగ్రహ రుద్రహోమం అనంతరం దుర్గాసప్తశతి 18 అధ్యాయాలతో హోమం నిర్వహించారు. దసరా సెలవులు కావడంతో వేలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. వైదిక కార్యక్రమాలను పెండ్యా ల సందీప్శర్మ, గంగు ఉపేంద్రశర్మ, ప్రణవ్, కాశీనాథం నిర్వహించగా అన్నప్రసాద వితరణలో గండ్రాతి రాజు, పల్లం రమేశ్, కోన శ్రీకర్, పులి రజినీకాంత్ సేవలందించారు. నేడు రుద్రేశ్వరీదేవికి లక్షతులసీ అర్చన నిర్వర్తించనున్నట్లు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. ఈవో వెంకటయ్య పర్యవేక్షించారు.
న్యూశాయంపేట : దేవీ శరన్నవరాత్రోత్సవాలు పురస్కరించుకొని గ్రేటర్ 31వ డివిజన్ న్యూశాయంపేటలోని రాజరాజేశ్వర దేవాలయంలో ఐదో రోజు అమ్మవారు అన్నపూర్ణేశ్వరి మాతగా భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజాము నుంచే అమ్మవారిని అన్నపూర్ణేశ్వరి మాతగా అలంకరించి, పూజలు చేశారు. అర్చకుడు పానుగంటి నాగేంద్రశర్మ ఆధ్వర్యంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
హనుమకొండ, అక్టోబర్ 19 : పద్మాక్షి కాలనీలోని శ్రీ హనుమద్గిరి పద్మాక్షి దేవాలయంలో ఘనంగా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 5వ రోజు పద్మాక్షి అమ్మవారు స్కందమాతా(ఉపాంగ లలితా) అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారికి లక్ష పుష్పార్చన నిర్వహించినట్లు అర్చకుడు నాగిళ్ల శంకర్ శర్మ, వేద పండితుడు నాగిళ్ల షణ్ముక పద్మనాభ అవధాని తెలిపారు. కాగా, అమ్మవారిని చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.