దుగ్గొండి, డిసెంబర్ 15: కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మనఊరు-మనబడి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని మండల ప్రత్యేకాధికారి శ్రీనివాసరావు అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఆయన మనఊరు-మనబడి కార్యక్రమ నిర్వహణపై మండలస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మనఊరు-మనబడి కార్యక్రమంలో ఎంపికైన పాఠశాలల్లో జరుగుతున్న పనుల వివరాలను సమావేశంలో చర్చించారు.
మనఊరు-మనబడి కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని సర్కారు బడులకు మహర్దశ రానుందని శ్రీనివాసరావు అన్నారు. సీఎం కేసీఆర్ విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని చెప్పారు. రాష్ట్రంలో పేద, ధనిక తేడాలేకుండా ప్రతి విద్యార్థికీ కార్పొరేట్స్థాయి విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కల్పిస్తున్నట్లు వివరించారు. గ్రామాల్లో సర్కారు బడులను కాపాడుకోవాల్సిన బాధ్యత గ్రామస్తులపై ఉందన్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేస్తూ నాణ్యమైన నిర్మాణాలు చేపట్టి ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసుకోవాలని కోరారు.
పాఠశాలల్లో పనుల పరిశీలన
మండలకేంద్రంతోపాటు దేశాయిపల్లి, అడవిరంగాపురంలో జరుగుతున్న మన ఊరు-మన బడి పనులను శ్రీనివాసరావు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. పనులను పారదర్శకంగా నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ కోమల, ఎంపీడీవో కృష్ణప్రసాద్, ఎంపీవో శ్రీధర్గౌడ్, పీఆర్ ఏఈ హరిదాస్యం వెంకటేశ్వర్లు, ఎంఈవో చదువుల సత్యనారాయణ పాల్గొన్నారు.
పనుల్లో వేగం పెంచాలి
ఖానాపురం/చెన్నారావుపేట/సంగెం: మన ఊరు-మన బడి పనుల్లో వేగం పెంచాలని మండల నోడల్ అధికారి మంగ్యానాయక్ అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో పాఠశాలల వారీగా పనులపై అధికారులు, హెచ్ఎంలు, ఎస్ఎంసీ చైర్మన్లతో సమీక్షించారు. వంద శాతం పూర్తయిన విద్యుత్ పనులు, చివరి దశలో ఉన్న మేజర్, మైనర్ రిపేర్లు, డైనింగ్ పనులను గుర్తించారు. ఈజీఎస్ పనులు బుధరావుపేట మినహా మరెక్కడా ప్రారంభం కాలేదని, అన్ని పాఠశాలల్లో తక్షణమే పనులను ప్రారంభించాలని కోరారు. నిధుల కోరత లేదని, పనులు పూర్తి చేసిన వెంటనే ఖాతాల్లో నిధులు జమవుతాయని చెప్పారు.
సమావేశంలో ఏఈ శోభన్, ఎంపీవో రవి, సర్పంచ్లు, హెచ్ఎంలు పాల్గొన్నారు. అలాగే, చెన్నారావుపేట ఎంపీడీవో కార్యాలయంలో మనఊరు-మనబడి అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి డాక్టర్ బాలకృష్ణ మాట్లాడుతూ పనులను త్వరగా పూర్తి చేయాలని కోరారు.
సమీక్షలో ఎంపీడీవో ప్రకాశ్, నోడల్ అధికారి సృజన్తేజ, డీఈ రాజశేఖర్, హెచ్ఎంలు, సర్పంచ్లు, ఎస్ఎంసీ చైర్మన్లు, సీఆర్పీ సిబ్బంది సాల్గొన్నారు. అంతేకాకుండా మనఊరు-మనబడి కార్యక్రమ పనులపై ఎంపీపీ కందకట్ల కళావతి సంగెం మండల పరిషత్ కార్యాలయంలో సమీక్షించారు. ఇంకా పనులు ప్రారంభం కాని పాఠశాలల్లో వెంటనే చేపట్టాలని ఆదేశించారు. జడ్పీటీసీ గూడ సుదర్శన్, వైస్ ఎంపీపీ మల్లయ్య, ఎంపీడీవో కొమురయ్య, ఎంఈవో విజయ్కుమార్, ఏఈ రమేశ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.