మక్కల కొనుగోళ్లు వరంగల్ జిల్లాలో జోరందుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 35 కొనుగోలు కేంద్రాలకు ఆమోదం తెలుపగా, ప్రస్తుతం 21 ఏర్పాటయ్యాయి. వాటిల్లో ఇప్పటికే 9వేల క్వింటాళ్ల కొనుగోలు పూర్తయ్యింది. మరో రెండు రోజుల్లో 14 కేంద్రాలను అధికారులు ప్రారంభించనున్నారు. ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా మక్కలు కొంటుండగా రైతులకు మద్దతు ధర లభిస్తున్నది. జిల్లా వ్యాప్తంగా యాసంగి సీజన్లో 88,415 ఎకరాల్లో మక్కజొన్న సాగుచేయగా, 1,66,693 టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. అందులో 54,225 టన్నులు రైతుల నుంచి నేరుగా కొనాలని నిర్ణయించారు. ప్రారంభించిన కేంద్రాల్లో కొనుగోలు చేసిన మక్కలను అధికారులు మూడు సెక్టార్లు ఏర్పాటు చేసి గోదాములకు తరలిస్తున్నారు.
– వరంగల్, మే 16 (నమస్తే తెలంగాణ)
వరంగల్, మే 16 (నమస్తే తెలంగాణ): జిల్లాలో మక్కల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. మార్క్ఫెడ్ అధికారులు ముమ్మరంగా కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే సుమారు 9వేల క్వింటాళ్ల మక్కలను కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం 21 కేంద్రాల్లో ప్రభుత్వ మద్దతు ధరతో మక్కల కొనుగోళ్లు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇంకో 14 కేంద్రాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. రైతులకు మద్దతు ధర దక్కాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ యాసంగి మక్కలను కొనుగోలు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మార్క్ఫెడ్ సంస్థను రంగంలోకి దింపింది. దీంతో ఆయా అధికారులు జిల్లాలో యాసంగి మక్కజొన్న సాగు విస్తీర్ణం వివరాలను సేకరించి, దిగుబడి అంచనా వేశారు. జిల్లా వ్యాప్తంగా 88,415 ఎకరాల్లో రైతులు మక్కజొన్న పంట సాగు చేసినట్లు గుర్తించారు. అత్యధికంగా గీసుగొండ మండలంలో 13,910, దుగ్గొండిలో 11,957, సంగెంలో 11,938, నెక్కొండలో 11,720, చెన్నారావుపేటలో 10,723 ఎకరాల్లో వేసినట్లు ప్రభుత్వానికి పంపిన నివేదికలో పేర్కొన్నారు.
ఖానాపురంలో 2,576, నల్లబెల్లిలో 7,184, నర్సంపేటలో 4,966, ఖిలావరంగల్లో 2,670, వరంగల్లో 1,040, పర్వతగిరిలో 6,435, రాయపర్తిలో 965, వర్ధన్నపేటలో 2,328 ఎకరాల్లో రైతులు మక్కజొన్న పంటను సాగుచేశారని తెలిపారు. 88,415 ఎకరాల్లో 1,66,693 టన్నుల మక్కల దిగుబడులు వచ్చే అవకాశం ఉందని, ఇందులో రైతుల నుంచి నేరుగా 54,225 టన్నుల మక్కలను ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయాల్సి ఉంటుందని అంచనా వేశారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా 35 కేంద్రాల ఏర్పాటు కోసం ప్రతిపాదించగా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. చెన్నారావుపేట మండల కేంద్రంలో 2, పర్వతగిరిలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో 2, ఖానాపురం మార్కెట్యార్డు, దుగ్గొండి, గిర్నిబావి, వెంకటాపురం, నాచినపల్లి, నల్లబెల్లి, మూడుచెక్కలపల్లి, నర్సంపేటలోని వ్యవసాయ మార్కెట్ యార్డు, గురిజాల, మహేశ్వరం, నెక్కొండలోని వ్యవసాయ మార్కెట్, తోపనపల్లి, రెడ్లవాడ, ఊకల్హవేలి, మొగిలిచర్ల, ఎలకుర్తిహవేలి, గీసుగొండ, వంచనగిరి, వరంగల్ ఎనుమముల వ్యవసాయ మార్కెట్, ఆరెపల్లి, సంగెం, నల్లబెల్లి(సంగెం), కాపులకనపర్తి, చింతలపల్లి, చౌటపల్లి, చింతనెక్కొండ, ఏనుగల్, రాయపర్తిలోని వ్యవసాయ మార్కెట్ యార్డు, వర్ధన్నపేటలో ఒక్కో కొనుగోలు కేంద్రాన్ని నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
చెన్నారావుపేట, ఖానాపురం, దుగ్గొండి, మహ్మదాపురం, నాచినపల్లి, నల్లబెల్లి, నర్సంపేట, గురిజాల, నెక్కొండ, రెడ్లవాడ, గీసుగొండ, వంచనగిరి, వరంగల్, సంగెం, పర్వతగిరి, చౌటపల్లి, రాయపర్తి, వర్ధన్నపేట పీఏసీఎస్లు, ఊకల్హవేలి, కాపులకనపర్తి ఎఫ్ఎస్సీఎస్, ఓడీసీఎంఎస్తో పాటు కొన్ని రైతు ఉత్పత్తి సంస్థలకు ఈ మక్కల కొనుగోలు కేంద్రాల నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. 21 కేంద్రాలు ప్రారంభించగా మక్కల కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. మిగతా 14 కేంద్రాల్లో నేడో రేపో కొనుగోళ్లు అధికారులు ప్రారంభించనున్నారు. 22 కేంద్రాల్లో 9వేలకుపైగా క్వింటాళ్ల మక్కలను రైతుల నుంచి ప్రభుత్వ మద్దతు ధరతో కొనుగోలు చేసినట్లు మార్క్ఫెడ్ సంస్థ జిల్లా మేనేజర్ మహేశ్ చెప్పారు. ప్రభుత్వ ఆదేశాలతో స్పెషల్ ఆఫీసర్లు మక్కల కొనుగోళ్లను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. ఎమ్మెల్యేలు కూడా మక్కల కొనుగోలు కేంద్రాలను సందర్శించి కొనుగోళ్ల తీరుపై రైతులతో మాట్లాడుతున్నారు. సమస్యలు ఏమైనా ఉంటే తమకు తెలియజేస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు.
ఎస్డబ్ల్యూసీ గోదాముల్లో నిల్వ
రైతుల నుంచి కొనుగోలు చేసిన మక్కలను మూడు సెక్టార్ల ద్వారా గోదాములకు తరలించాలని మార్క్ఫెడ్ సంస్థ అధికారులు నిర్ణయించారు. నర్సంపేట, చెన్నారావుపేట, నెక్కొండ మండలాలను ఒక సెక్టార్, ఖానాపురం, నల్లబెల్లి, దుగ్గొండి, సంగెం మండలాలను మరో సెక్టార్, గీసుగొండ, వరంగల్, ఖిలావరంగల్, పర్వతగిరి, వర్ధన్నపేట, రాయపర్తి మండలాలను ఇంకో సెక్టార్గా గుర్తించారు. ఆయా సెక్టార్ పరిధిలోని కేంద్రాల్లో రైతుల నుంచి కొనుగోలు చేసిన మక్కలను గోదాములకు రవాణా చేసే బాధ్యతలను ట్రాన్స్ఫోర్ట్ కాంట్రాక్టర్లకు అప్పగించారు. జిల్లాలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన రాష్ట్ర గిడ్డంగుల సంస్థ(ఎస్డబ్ల్యూసీ) గోదాముల్లో మక్కలను నిల్వ చేయాలని నిర్ణయించారు.
దుగ్గొండి మండలం చలపర్తి, నర్సంపేట మండలం బాంజిపేట, నల్లబెల్లి మండలం అర్శనపల్లిలో ఎస్డబ్ల్యూసీ ఆధ్వర్యంలో 25వేల టన్నుల కెపాసిటీ గల గోదాములు నిర్మించారు. వ్యవసాయ మార్కెటింగ్, గిడ్డంగుల శాఖ మంత్రి ఎస్ నిరంజన్రెడ్డి, పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డితో కలిసి ఇటీవల చలపర్తిలో గోదాములను ప్రారంభించారు. ప్రస్తుతం రైతుల నుంచి కొనుగోలు చేస్తున్న మక్కలు ఈ గోదాములకు చేరుతున్నట్లు అధికారులు తెలిపారు. ఎస్డబ్ల్యూసీ గోదాములతో పాటు నల్లబెల్లి మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాముల్లోనూ మక్కలను నిల్వ చేయనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ గోదాములు అందుబాటులోకి రావడంతో వారు ఊపిరి పీల్చుకుంటున్నారు.