హనుమకొండ, మే 5: ‘నా గొంతులో ప్రాణమున్నంత వరకు బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదు’ అని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్విప్, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ స్పష్టం చేశారు. సెయింట్ గ్యాబ్రియల్ స్కూల్ గ్రౌండ్లో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలో వరంగల్ నగరం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. పశ్చిమ నియోజక వర్గం పరిధిలో 41వేల గులాబీ సైనికుల సభ్యత్వం ఉందన్నారు. తన 30ఏళ్ల రాజకీయ జీవితంలో బీఆర్ఎస్ ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. తాను ఎమ్మెల్యే అయింది పదవి కోసమో, దర్పం కోసమో కాదని, నియోజకవర్గ ప్రజల కోసమని స్పష్టం చేశారు. పార్టీ ఎలాంటి బాధ్యతలు అప్పగించినా నిబద్ధతో చేశానన్నారు. తాను ఈ స్థాయిలో ఉన్నానంటే బీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పెట్టిన భిక్ష అన్నారు. సమైక్యరాష్ట్రంలో నియోజకవర్గ అభివృద్ధికి రూ. 5కోట్ల తేలేని నిస్సహాయ స్థితిలో ఉన్నానని, తెలంగాణ ఏర్పాటు తర్వాత పెద్ద మొత్తంలో నిధులు తెస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నానన్నారు.
ఫాతిమానగర్లో మరో ైప్లెఓవర్ బ్రిడ్జి కావాలని అప్పటి సీఎం వైఎస్ఆర్ను అడిగితే దాంతో వరంగల్ నగరానికి ఏ ఉపయోగం ఉండదని బదులిచ్చారని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ రూ.70కోట్లు మంజూరు చేశారని, ఇప్పుడు ైప్లెఓవర్ నిర్మాణం కొనసాగుతున్నదని చెప్పారు. వరంగల్ ఇప్పటికే ఎడ్యుకేషన్, మెడికల్ హబ్లుగా మారిందని, పలు ఐటీ కంపెనీలను తీసుకొచ్చి సుమారు రెండు వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారని, మరిన్ని ఐటీ కంపెనీలు త్వరలో రానున్నాయని చెప్పారు. రూ. 30కోట్లతో భద్రకాళి ఆలయానికి మాడ వీధులు నిర్మిస్తున్నామని చెప్పారు. ఎంతో ఘన చరిత్ర ఉన్న ఓరగల్లులో జైనులు నడయాడారని, ప్రపంచ దేశాల నుంచి జైనులు వచ్చి ఇక్కడి అగ్గలయ్య గుట్టను సందర్శిస్తున్నారని తెలిపారు. రూ.60కోట్లతో కాళోజీ కళాక్షేత్రం నిర్మిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ స్థలాల్లో నిరుపేదలు గుడిసెలు వేసుకొంటే గతప్రభుత్వాలు పట్టించుకోలేదని, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ వారికి 58,59జీవోల పట్టాలు ఇచ్చి భరోసా కల్పించారని, దీంతో 30ఏళ్ల నిరుపేదల నిరీక్షణకు తెరపడినట్లయిందన్నారు.
‘నిరుపేదలకు పట్టాలివ్వడం నా అదృష్టంగా భావిస్తున్నా, నా జీవితం ధన్యమైంది’ అని చీఫ్విప్ పేర్కొన్నారు. ఇకనుంచి జిల్లాలోని గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. ఎన్నికలప్పుడు దేవుల్ల పేరు చెప్పి ప్రజల మధ్య మత చిచ్చు పెడుతూ వస్తున్న దయ్యాల పార్టీ బీజేపీ, వరంగల్ నగరాభివృద్ధికి ఒక్క రూపాయి కూడా తేలేదన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్, శాసన మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాశ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, ఎంపీలు పసునూరి దయకర్, మాలోత్ కవిత, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్రెడ్డి, బస్వరాజు సారయ్య, పాడి కౌశిక్రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యేలు ఆరూరి రమేశ్, పెద్ది సుదర్శన్రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, తాటికొండ రాజయ్య, ఒడితల సతీష్కుమార్, నన్నపునేని నరేందర్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, శంకర్నాయక్, మేయర్ గుండు సుధారాణి, కార్పొరేషన్ చైర్మన్లు కే వాసుదేవారెడ్డి, మెట్టు శ్రీనివాస్, కుడా చైర్మన్ సంఘంరెడ్డి సుందర్రాజు యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ఖాన్, మాజీ ఎంపీ సీతారాంనాయక్, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, పార్టీ సీనియర్లు పుల్లా పద్మావతి, పులి రజినీకాంత్, మైనార్టీ నాయకుడు నయీమొద్దీన్, మైనార్టీ కార్పొరేషన్ సభ్యుడు దర్శన్సింగ్ పాల్గొన్నారు.