హనుమకొండ, జూలై 15 : కాంగ్రెస్ ప్రభుత్వ చిరువ్యాపారులతో చెలగాటమాడుతున్నదని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. బుధవారం సాయంత్రం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో దాస్యంను కలిసి తమ గోడును వెళ్లబోసుకొని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేండ్ల బీఆర్ఎస్ హయాంలో అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉండగా, కాంగ్రెస్ రెండున్నరేండ్ల పాలనలో ఆగమవుతున్నారని విమర్శించారు. విశ్వ సుందరీమణులు వస్తున్నారని ఎన్ఐటీ వద్ద ఉన్న వీధి వ్యాపారుల సముదాయాలను కూల్చివేస్తే బీఆర్ఎస్ వారికి అండగా నిలిచిందన్నారు.
పెద్దలకు మేలు చేసేందుకు చౌరస్తాలోని పేదల జీవనోపాధిని దెబ్బతీయాని చూశారన్నారు. బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా వెంట నిలిచి కాపాడామన్నారు. కాజీపేట, హనుమకొండ కొత్తూరు జెండా వద్ద ఉన్న చిరు వ్యాపారుల సముదాయాలను ఎలాంటి సమాచారం లేకుండా కూల్చారన్నారు. మున్సిపల్ అధికారులు, పాలకులు చిరువ్యాపారులకు ఉన్న హక్కులను, చట్టాలను కాలరాస్తున్నారని ఆరోపించారు. వారి చర్యలు రాజ్యాంగ విరుద్ధమన్నారు. తమతో పాటు లీగల్ సెల్ కూడా చిరు వ్యాపారులకు అండగా ఉంటుందని, వారిని ఆదుకొనే బాధ్యతను తీసుకు ంటామని, వారి తరపున పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. నష్టపోయిన చిరు వ్యాపారులకు పరిహారం ఇవ్వాలని దాస్యం డిమాండ్ చేశారు. ఆయన వెంట లీగల్ సెల్ బాధ్యుడు నాయిని రవి, చిరు వ్యాపారుల సంఘం బాధ్యులు ఇస్మాయిల్, అబ్బు తదితరులున్నారు.