జయశంకర్ భూపాలపల్లి, జనవరి 11 (నమస్తే తెలంగాణ): జిల్లా కేంద్రానికి చెందిన ఇద్దరు కొద్ది రోజుల క్రితం సైబర్ నేరగాళ్ల వలలో పడి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు పోగొట్టుకోగా, జిల్లాకు చెందిన సైబర్ క్రైం పోలీసులు డబ్బులను ఫ్రీజ్ చేయించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులు 24 గంటల్లోగా సైబర్ క్రైం 1930నంబర్ను సంప్రదించారు. అందులో ఓ మహిళ పోగొట్టుకున్న డబ్బుల్లో కొంత మొత్తాన్ని సైబర్ నేరగాళ్లు అప్పటికే డ్రా చేసుకోగా, మిగతా డబ్బులను సైబర్ క్రైం పోలీసులు ఫ్రీజ్ చేయించారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యాపారి భార్య 2022 డిసెంబర్ 26న ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసింది. అందులో తక్కువ ధరలకే చీరలు వస్తాయని ఓ లింక్ వచ్చింది. దాన్ని ఓపెన్ చేయగా కొన్ని చీరలను చూపి, తక్కువ ధరకే వస్తాయని నమ్మబలికారు. దీంతో సదరు మహిళ తన భర్త డూకెడిట్ కార్డు నంబర్ను ఎంటర్ చేసింది.
ఓటీపీ నంబర్ రాగా చెప్పడంతో ఆమె భర్త అకౌంట్ నుంచి సైబర్ నేరగాళ్లు రూ.57,586 కాజేశారు. వెంటనే సైబర్ క్రైం టోల్ ఫ్రీ నంబర్ 1930కు ఫోన్ చేసి విషయాన్ని తెలియజేసింది. అదేవిధంగా ఈనెల 3న జిల్లా కేంద్రానికి చెందిన మరో మహిళకు ఓ వ్యక్తి ఫోన్ చేసి మీ పేర 15 పాస్పోర్టులు అక్రమంగా జారీ అయ్యాయని, వాటి వల్ల మీకు ఇబ్బంది తలెత్తకుండా రద్దు చేయాలంటే మీ గూగుల్ పే నంబర్ కొట్టాలని చెప్పాడు. అలా చేస్తే డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతాయి కదా అని అడగ్గా తిరిగి మీకే వస్తాయని తెలిపాడు. దీంతో అతడి మాటలు నమ్మిన ఆమె గూగుల్ పే నంబర్ కొట్టింది. దీంతో రూ.95,499 ఆమె ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు కాజేశారు. డబ్బులు తిరిగి రాకపోవడంతో ఆ నంబర్కు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో బాధితురాలు సైబర్ క్రైం టోల్ఫ్రీ 1930 నంబర్కు ఫోన్ ఫిర్యాదు చేసింది.
జిల్లా సైబర్ క్రైం పోలీసులు వెంటనే రంగంలోకి దిగి బాధితుల వివరాలు, వారు పోగొట్టుకున్న బ్యాంకు ఖాతా వివరాలు తెలుసుకొని విచారణ జరిపారు. సైబర్ నేరగాళ్లు కొంత డబ్బు డ్రా చేయగా, మిగతా డబ్బును సైబర్ క్రైం పోలీసులు ఫ్రీజ్ చేయించారు. ఆ డబ్బులు కోర్టు ద్వారా తీసుకోవాల్సి ఉంటుందని, అందుకు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయించుకోవాలని సూచించడంతో భూపాలపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.