వర్ధన్నపేట, సెప్టెంబర్ 13: వరి, వాణిజ్య పంటలతోపాటు పప్పు ధాన్యాలు సాగు చేస్తేనే రైతులకు మేలని జేడీఏ ఉషాదయాళ్ సూచించారు. మండలకేంద్రంలో రైతు ఎండీ గౌస్ ఎన్ఎస్ఎఫ్ఎం పథకంలో ఉచితంగా విత్తనాలు తీసుకొని కంది పంట సాగు చేశాడు. ఎన్ఎస్ఎఫ్ఎం కన్సల్టెంట్ సారంగం, ఏవో రాంనర్సయ్యతో కలిసి మంగళవారం ఆమె పంటను పరిశీలించారు. రైతులు వరి, పత్తి, మిర్చి పంటలపైనే ఆధారపడితే వాతావరణం సకహకరించని సమయంలో ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఉషాదయాళ్ సూచించారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతులు కంది, పెసర, మినుము పంటలను సాగు చేస్తే మంచి దిగుబడితో ఆర్థిక ప్రగతి సాధించొచ్చని సూచించారు. కంది పంట ఏపుగా పెరిగేందుకు 20 కిలోల యూరియా, 10 కిలోల పోటాష్ వేసుకోవడంతోపాటు 19:19:19 1 కేజీ, 250 గ్రాముల పాలిఫీల్డ్ను కలిపి పిచికారీ చేసుకోవాలని వివరించారు. అలాగే, పచ్చపురుగు, లద్దెపురుగు, పూతదశలో వచ్చే నల్లమచ్చ పురుగుల నివారణ కోసం క్లోరోఫైరిపాస్ 2 ఎంఎల్, 5 ఎంఎల్ వేపనూనెను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలని సూచించారు. కంది సాగు చేయడం వల్ల భూమి సారవంతంగా తయారవుతుందని వెల్లడించారు. కార్యక్రమంలో ఏఈవోలు మౌనిక, శరత్, రైతులు పాల్గొన్నారు.
యాజమాన్య పద్ధతులతో అధిక దిగుబడి
రాయపర్తి: రైతులు సరైన యాజమాన్య పద్ధతులు అవలంబిస్తే ఆశించిన దిగుబడి సాధిస్తారని జేడీఏ ఉషాదయాళ్ అన్నారు. ఏవో గుమ్మడి వీరభద్రం నేతృత్వంలో బురహాన్పల్లి, కొండూరులో వరి, పత్తి క్షేత్రాలను ఆమె వ్యవసాయాధికారుల బృందంతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కొండూరులో రైతులు సాగు చేసిన అధిక సాంద్రత కలిగిన పత్తి పంట క్షేత్రాలను సందర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వరిలో కాండం తొలుచు పురుగు ఉధృతి, ఎరుపు రోగం ఎక్కువగా కనిపిస్తున్నట్లు చెప్పారు. దీని నివారణకు వ్యవసాయాధికారులు సూచించిన విధంగా పురుగు మందులు పిచికారీ చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏఈవోలు వేమిరెడ్డి హిమబిందు, ఉడుత సాయి ప్రసాద్, సర్పంచ్ కర్ర సరితా రవీందర్రెడ్డి, రైతులు ఆవుల రోజారాణి, గుగులోత్ సోమన్న, కర్ర ప్రవీణ్రెడ్డి, పుల్లా ఎల్లాగౌడ్, బాపురెడ్డి పాల్గొన్నారు.