నర్సంపేట రూరల్, మే 10 : అన్ని రకాల కూరలకు కొత్త రుచి, ఘుమఘుమలాడే సువాసన తెచ్చే ఆకు పుదీనా. అలాంటి పుదీనా తోటలకు మాధన్నపేట పెట్టింది పేరు. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడి, ఆశించిన లాభాలు తెచ్చిపెడుతుండడంతో ఏటేటా నర్సంపేట మండలంలో ఈ పంట సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. వాణిజ్య పంటల సాగుతో ఆర్థికంగా నష్టపోయిన రైతులు ప్రత్యామ్నాయంగా పుదీనాపై ఆసక్తి చూపుతున్నారు.
అన్ని కాలాల్లోనూ…
అన్ని కాలాల్లో నిరంతరం పుదీనా సాగు చేస్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయ బావులు, బోర్ల నుంచి నీరందిస్తూ అధిక దిగుబడులను సాధిస్తున్నారు. నీటి సౌకర్యం బాగుంటే 25 నుంచి 30 రోజుల్లో ఒక పంట పండించవచ్చని రైతులు చెబుతున్నారు. ఎక్కువ శాతం వ్యవసాయం మీదనే ఆధారపడే ఇక్కడి రైతులు తమకున్న కొద్దిపాటి భూముల్లో వాణిజ్య పంటలు సాగు చేయడం కుదరదు. ఈ క్రమంలో సేంద్రియ పద్ధతుల్లో పుదీనా తోటలను సాగుచేస్తూ అధిక లాభాలు ఆర్జిస్తున్నారు.
వేసవిలో ఎక్కువగా..
పుదీనకు మార్కెట్లో ఏడాది పొడవునా మంచి డిమాండ్ ఉంటుంది. వేసవిలో పెళ్లిళ్ల సమయంలో గిరాకీ మరింత ఎక్కువే. పుదీన నారు, కాంప్లెక్స్ ఎరువులకు గుంటకు రూ.1000 ఖర్చు చేస్తే రూ.8వేల నుంచి రూ.10వేల వరకు లాభాలు ఆర్జించవచ్చని, పెళ్లిళ్ల సమయంలో మరింత లాభాలు అధికంగా వస్తాయని రైతులు అంటున్నారు. ఒక ఎకరం వరి సాగు చేస్తే వచ్చే ఆదాయాన్ని 10గుంటల భూమిలో పుదీన తోట సాగుచేసి సంపాదించవచ్చని రైతులు తెలిపారు. వేసవి కాలంలో ఈ తోటలను రైతులు అధికంగా పండిస్తారు. వేసవిలో ధరలు ఎక్కువగా పలుకడమే ఇందుకు కారణమని చెబుతున్నారు.
వర్షాకాలంలో నీరు ఎక్కువగా నిలువడంతో తోటలు మురిగి పాడవుతాయి. నీటి సౌకర్యాలు అనువుగా ఉన్న ఈ రోజుల్లో పలువురు రైతులు పుదీన తోటలు పండిస్తూ వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నారు. 5గుంటల భూమి నుంచి 20 గుంటలు, ఆపై ఎకరం వరకు ఉన్న భూమిని చిన్న, చిన్న కమతాలుగా ఏర్పాటు చేసుకొని మండలంలో 280 ఎకరాల విస్తీర్ణంలో పుదీన తోటల సాగు చేస్తున్నారు. మొదటి నెల రోజుల్లో పంట చేతికొస్తుంది. ఆ తర్వాత ప్రతి 25రోజులకు ఒకసారి కోస్తారు. ఇలా ఒకసారి వేసిన పంటను 7, 8 సార్లు కోసి కట్టలు కట్టి మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఇలా కోస్తున్న కొద్దీ పెరుగుతుంది. వాణిజ్య పంటల కంటే పుదీన సాగుతో ఎక్కువ లాభాలు సాధించవచ్చని రైతులు స్పష్టం చేస్తున్నారు. ఎర్ర, నల్లనేలలు పుదీన సాగుకు అనుకూలం.
సాగుపై పెరిగిన ఆసక్తి…
పత్తి, పసుపు, మిర్చి వంటి వాణిజ్య పంటల నుంచి రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించారు. మాధన్నపేటకు చెందిన పెసరు కమలాకర్, వక్కల రాజమౌళి, మెంతుల రమ, వక్కల లింగమూర్తి, వక్కల చంద్రయ్య, దండు సాంబరాజ్యం, కేశెట్టి శ్రీనివాస్, కేశెట్టి సదానందం, గొర్రె ప్రభాకర్, దండు తిరుపతి, దండు రామనర్సు, మల్లెల కొమురయ్య, కేశెట్టి అనిల్, కేశెట్టి అరుణ, వక్కల అరుణ, వక్కల లక్ష్మి, జయలక్ష్మి, పెసరి లత, పెసరి అరుణ, పెసరి సాంబరాజ్యం, విజయలతో పాటు మరో 26మంది రైతులు పుదీన తోటలు సాగుచేస్తున్నారు. ఒకప్పుడు ఒకరిద్దరు మాత్రమే ఈ తోటలు వేయగా ప్రస్తుతం ఈ ఒక్క గ్రామంలో 36మంది రైతులు 40ఎకరాలకు పైగా పుదీన వేశారు. వీటిని వరంగల్, నర్సంపేట, మహబూబాబాద్, జనగామ తదితర పట్టణాలకు తరలించడంతో పాటు స్థానికంగా జరిగే వారాంతపు సంతల్లో విక్రయిస్తుంటారు.
పత్తికి బదులు పుదీనా వేసినం..
ఇదివరకు పత్తి, పసుపు, మిర్చి వేసినం. తెగుళ్లు వచ్చి గిట్టుబాటు ధర రాక నష్టం వచ్చింది. పత్తి వేస్తే దిగుబడి మంచి రాలే. అందుకే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వచ్చే పుదీన తోటలు పెట్టినం. నాకున్న మూడు ఎకరాల్లో ఒక్క ఎకరంలో పుదీన పండిస్తున్నా. ఇప్పుడు లాభాలు మంచిగనే ఉన్నయ్.
– వక్కల లక్ష్మి, మహిళా రైతు, మాధన్నపేట
ఎప్పుడూ నష్టం రాలే
నేడు ఐదేండ్ల సంది పుదీన తోటలు పెడుతున్న. ఎప్పుడు కూడ నష్టం రాలే. ఈ పంటతో ఎప్పటికి చేతిల పైసల్ ఉంటానయ్. కుటుంబ అవసరాలు తీరుతున్నయ్. మిగితా ఖర్చులకు ఉపయో గపడుతున్నయ్. ఈ పంటకు డిమాండ్ ఉన్న రోజుల్లో లాభాలు ఎక్కువగా వస్తాయి.
– వక్కల అరుణ, మహిళా రైతు, మాధన్నపేట
పదేళ్ల నుంచి సాగు చేస్తున్నా
నేను 10 ఏండ్ల నుంచి పుదీన తోటలను సాగుచేస్తున్నా. పెట్టుబడి ఖర్చులు పోను లాభాలు మంచిగ వస్తున్నయ్. ఈ తోటలకు చీడపీడల బాధ చాలా తక్కువ. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే దిగుబడులు బాగుంటది.
– కేశెట్టి అరుణ, మహిళా రైతు, మాధన్నపేట