నర్సింహులపేట, జూలై 18 : వానకాలం ప్రారంభమై నెలన్నర గడిచినా వర్షం కురవకపోవడంతో పంటల సాగు ముందుకు సాగడం లేదు. వాన పడుతుందనే ఆశతో రైతులు పత్తి, పెసర, మక్కజొన్న, పసుపు వంటి పంటలు వేశారు. బావులు, బోర్ల కింద వరినారు పోశారు. వాన రాక, కాల్వ పారక మొలకలు ఎండిపోతుండడంతో ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఉన్న చెలుకలో అడుగు అడుగునా బోర్లు వేస్తూ అలసిపోతున్నారు.
మరికొంత మంది క్రేన్తో బావులు తీస్తే ఆలస్యమవుతుందని జేసీబీలను వినియోగిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని పడమటిగూడెం గ్రామానికి చెందిన రైతు చిదిమిళ్ల భిక్షం గత జూన్లో తనకున్న ఎకరం 10 గుంటల భూమిలో 5 బోర్లు వేశారు. ఇటీవల మరో 6, మొత్తం 11 బోర్లు వేసినా చుక్క నీరు రాలేదని, ఇందుకోసం సుమారు రూ. 3,50,000 వరకు ఖర్చు చేసినట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.