పోచమ్మమైదాన్, డిసెంబర్ 22 : ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఉరితాడుగా మారిన సీపీఎస్ను అంతం చేయడమే పంతంగా పెట్టుకోవాలని సీపీఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్మితప్రజ్ఞ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న యూపీఎస్ను అడ్డుకోవడంతొ నాటె పాత పెన్షన్ అమలు కోసం పోరాటం చేయాలని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలతో ఆదివారం వరంగల్లోని ఇస్లామియా కళాశాల మైదానంలో కాకతీ కదనభేరిని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ స్కీం ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు కందుల జీవన్కుమార్ అధ్యక్షతన నిర్వహిచిన బహిరంగ సభకు ముఖ్య అతిథిగా స్మితప్రజ్ఞతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల శ్రీకాంత్, కోశాధికారి ఈడిగి నరేశ్గౌడ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా స్మితప్రజ్ఞ మాట్లాడుతూ 2004లో సీపీఎస్ విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఆనాటి సంఘాలు ప్రతిఘటించకపోవడం వల్లే ఉద్యోగ, ఉపాధ్యాయులకు అమలు చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1, 2025 నుంచి అమలు చేయనున్న యూపీఎస్ను అందరూ ఏకమై ఆపాలన్నారు. రాష్ట్రంలో 2.50 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులున్నారని, వీరందరికీ కొత్త పెన్షన్ విధానం గుదిబండగా మారుతుందని, వీరి ఆవేదనను ప్రభుత్వం అర్ధం చేసుకుని పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలైన రాజస్తాన్, హిమాచల్ప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్తో పాటు పంజాబ్లో పాత పెన్షన్ను అమలు చేస్తున్నారని స్మితప్రజ్ఞ పేర్కొన్నారు. సభలో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు లింగమూర్తి, బుచ్చన్న, కొంపెల్లి రవీందర్రెడ్డి, అఫ్జల్, కొండా శ్రీనివాస్, లక్ష్మణమూర్తి, రవికాంత్, నాగమణి, రవిచంద్ర, తోట విక్రమ్, ఆవునూరి రవి, కిషన్, రాజేందర్, రవికాంత్, శేషగిరి, డాక్టర్ అన్వర్, శివకోటి, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.
సీఎం రేవంత్రెడ్డి గత ఎన్నికల ప్రచారంలో ఓరుగల్లు వేదికగా ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలి. ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా దీనిని ప్రకటించారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు పెనుముప్పుగా మారిన నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ అదే ఓరుగల్లు వేదికగా కాకతీ కదన భేరి ద్వారా విన్నవిస్తున్నాం. ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయినందున మా సమస్యను పరిష్కరించాలి.