భూపాలపల్లి రూరల్, ఫిబ్రవరి 20 : అవినీతికి ఏ శాఖ, ఎవరూ అతీతం కాదని తేలిపోయింది. కిందిస్థాయి నుంచి పై స్థాయి వరకు కొందరు పైసా ముట్టనిదే పని చేయడంలేదు. న్యాయం కోసం కోర్టుకు వెళ్లిన ఓ రైతునూ అవినీతి జలగలు వదలలేదు. కోర్టులో పనిచేసే కొందరు సిబ్బంది పైసలిస్తేనే పని చేస్తామని తెగేసి చెప్పారు. దీంతో ఆ రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ కోర్టులో లంచం తీసుకుంటూ శుక్రవారం ముగ్గురు సిబ్బంది ఏసీబీకి పట్టుబడ్డారు.
ఏసీబీ వరంగల్ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం..గణపురం మండలం కర్కపల్లి శివారులో రైతు గోపాల్రావుకు చెందిన 14 ఎకరాల వ్యవసాయ భూమి తనదని అదే ప్రాంతానికి కాల్వ రాంరెడ్డి లోయర్ కోర్టులో 1984 సంవత్సరంలో సివిల్ దావా వేశాడు. కింది స్థాయి కోర్టు నుంచి ఈ కేసు జిల్లా సెషన్స్ కోర్టుకు రాగా ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ కోర్టులో 2025 సెప్టెంబర్ 21వ తేదీన గోపాల్రావుకు అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చింది. గత 10వ తేదీన కోర్టు తీర్పునకు సంబంధించిన సర్టిఫైడ్ కాపీని పొందడానికి కోర్టు స్టెనోగ్రాఫర్, ఇన్చార్జి ఏవో పాలకుర్తి సాయిచరణ్ను రైతు గోపాల్రావు సంప్రదించగా రూ.20 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంత డబ్బు ఇచ్చుకోలేనని అన్నాడు. ఈ నేపథ్యంలో రూ.5 వేలు ఇవ్వాలని ఈ నెల 13వ తేదీన ఇన్చార్జి ఏవో చెప్పారు.
దీనిపై గోపాల్రావు ఏసీబీని ఆశ్రయించగా వారి సూచన మేరకు శుక్రవారం రూ.5 వేలను కోర్టు స్టెనోగ్రాఫర్, ఇన్చార్జి ఏవో పాలకుర్తి సాయిచరణ్కు ఇవ్వడానికి వచ్చాడు. డబ్బులను ఆఫీస్ సబార్డినేటర్ రజితకు ఇవ్వాలని వారు సూచించారు. అక్కడే ఉన్న ఆఫీస్ సబార్డినేట్ సునీత ఏవో తనను తీసుకోమన్నారని చెప్పి రూ. 5వేలు తీసుకున్నారు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్హ్యాండెడ్గా ఇన్చార్జి ఏవో పాలకుర్తి సాయిచరణ్, ఆఫీస్ సబార్డినేట్స్ రజిత, సునీతను పట్టుకున్నారు. నిందితులు ముగ్గురిని శనివారం వరంగల్ ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని ఏసీబీ వరంగల్ డీఎస్పీ సాంబయ్య తెలిపారు.