వర్ధన్నపేట, జూన్ 5 : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలోనే నిరంతర విద్యుత్ సరఫరా జరుగుతున్నదని ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం మండలంలోని కట్య్రాల శివారుల కల్యాణలక్ష్మి ఫంక్షన్హాల్లో విద్యుత్శాఖ ఆధ్వర్యంలో ఐనవోలు, పర్వతగిరి, వర్ధన్నపేట మండలాల పరిధిలో విద్యుత్ ప్రగతిసభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈ బిక్షపతి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఎమ్మెల్యే రమేశ్ హాజరై మాట్లాడారు.
తెలంగాణ ఏర్పడితే తెలంగాణ తీవ్ర విద్యుత్, సాగునీటి సమస్య వస్తుందని సమైక్య పాలకులు భయానికి గురిచేశారన్నారు. లోయర్ సీలేరు ప్రాజెక్టు తెలంగాణకు కాకుండా పోయినప్పటికీ సీఎం కేసీఆర్ ఎంతో మనోధైర్యంతో విద్యుత్ ఉత్పత్తిని పెంచి రైతులు, ప్రజలకు 24 గంటల పాటు విద్యుత్ను అందిస్తున్నారన్నారు. 2014 నుండి 2023 వరకు వర్ధన్నపేట నియోజకవర్గంలో రూ.606.64 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. అలాగే రూ. 207.91 కోట్లతో మూడు 220 విద్యుత్ సబ్స్టేషన్లు, రూ.18.11 కోట్లతో 132 కేవీ సబ్స్టేషన్ స్టేషన్లను నిర్మించి 13 హైటెన్షన్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. అలాగే 9 కోట్లతో కొత్తగా తొమ్మిది 33/11 కేవీ సబ్స్టేషన్లు, 8 కోట్లతో 20 ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే వివరించారు. రైతులు కేవలం వరి పంటపైనే ఆధారపడకుండా ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని వరంగల్ డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు అన్నారు. విద్యుత్ రంగంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని వరంగల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీలు అన్నమనేని అప్పారావు, మార్నేని మధుమతి, కమల, జడ్పీటీసీలు మార్గం భిక్షపతి, హనుమకొండ జడ్పీ వైస్చైర్మన్ గజ్జెల శ్రీరాములు, రైతు సమితి జిల్లా కన్వీనర్ లలితాయాదవ్, ఏఎంసీ చైర్మన్ స్వామిరాయుడు, పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్ఖన్నా, ఆయా మండలాల ప్రజాప్రతినిధులు, వివిధ విభాగాల ప్రతినిధులు, విద్యుత్శాఖ అధికారులు, సిబ్బంది, ఐనవోలు, పర్వతగిరి, వర్ధన్నపేట మండలాలకు చెందిన రైతులు, విద్యుత్ వినియోగదారులు పాల్గొన్నారు.