స్వేదపత్రం విడుదల సందర్భంగా ఆదివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రస్తావించారు. తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ పాలనలో ఉచిత విద్యుత్, సాగునీరు, రైతుబంధు తదితర విప్లవాత్మక నిర్ణయాలతో వ్యవసాయాన్ని పండుగ చేసి రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేసి ఇటు అభివృద్ధి, సంక్షేమ పథకాలతో సబ్బండ వర్గాలకు లబ్ధి చేకూర్చి, పరిపాలన వికేంద్రీకరణతో ప్రజలకు ఒనగూరిన ప్రయోజనాలను వివరించడంతో పాటు ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 600 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటుచేసిన పవర్ప్లాంట్, రూ.1200 కోట్లతో వరంగల్ నగరంలో 2100 పడకలతో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గురించి ప్రత్యేకంగా చెప్పారు. ఇవే గాక ఉమ్మడి జిల్లాకు అన్నింటా పెద్దపీట వేయగా పవర్పాయింట్ ప్రజెంటేషన్ను అన్ని వర్గాల ప్రజలు టీవీల్లో, స్మార్ట్ఫోన్లలో ఆసక్తిగా వీక్షించడం కనిపించింది.
వరంగల్, డిసెంబర్ 24(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో నీళ్ల కోసం ఉద్యమం జరిగింది. కొత్త రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అది నెరవేరింది. తెలంగాణ ప్రాంతం ఉమ్మడి రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలకు కేరాఫ్ అడ్రస్గా ఉండేది. వరుసగా 60 ఏండ్ల పాటు బతుకుపై, భాషపై దాడి కొనసాగింది. విధ్వంసం నుంచి వికాసం వైపు అడుగులు పడ్డాయి. అణచివేత నుంచి ఆత్మగౌరవం, సంక్షోభం నుంచి సంమృద్ధి వైపు అడుగులు పడ్డాయి. పరిపాలన సంస్కరణల్లో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లా.. వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలుగా ఏర్పడింది. పరిపాలన సౌలభ్యం లక్ష్యంగా కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్లు, పోలీసు డివిజన్లు ఏర్పాటయ్యాయి. ఆ తర్వాత పరిపాలన అభివృద్ధి ప్రజలకు దగ్గరగా ఉన్నది. అభివృద్ధిలో కీలకమైన కరెంటు సరఫరాకు ప్రాధాన్యం ఇచ్చింది. ఇందులో భాగంగా భూపాలపల్లిలో నిర్మించిన 600 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో ప్రత్యేకంగా ప్లాంట్ను 2015లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. నిరంతరం ఉచిత కరెంటుతో పంటలు బాగా పండాయి. రైతు ఆదాయం రెట్టింపయ్యింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమైంది. సాగునీటి సరఫరా ప్రక్రియలో కీలకమైన కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు. రైతు రుణమాఫీ, రైతుబంధు, వడ్ల కొనుగోళ్లతో రైతు కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకున్నాయి. రైతు వేదికల నిర్మాణం, నాణ్యమైన విత్తనాల సరఫరా, సబ్సిడీపై ఎరువుల సరఫరాతో రైతులు ఆర్థికంగా బలోపేతమయ్యారు. సబ్సిడీపై గొర్రెలు, చేప పిల్లల పంపిణీతో ఆయా వర్గాలు ఆర్థికంగా భరోసా సాధించాయి. పాల ఉత్పత్తిలోనూ తెలంగాణ రాష్ట్రం రికార్డులు సృష్టించింది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సంక్షేమ రంగంలో తెలంగాణ రాష్ట్రం కొత్త రికార్డులు సృష్టించింది. ఆసరా పెన్షన్లు, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, ఎస్సీ సంక్షేమం, ఎస్టీ సంక్షేమం, మైనార్టీ సంక్షేమం, దివ్యాంగుల సంక్షేమం, చేనేత సంక్షేమం, వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం వెచ్చించిన నిధులతో అన్ని వర్గాల్లో సంతృప్తి నెలకొన్నది. దళితబంధు, ఎస్సీ సబ్ప్లాన్, అంబేద్కర్ భవనాల నిర్మాణం, గ్రామ పంచాయతీలుగా తండాలు, పోడు భూములకు గిరిజనులకు పట్టాలతో కేసీఆర్ ప్రభుత్వం సంక్షేమంలో కొత్త రికార్డులు సృష్టించింది. మోడల్ మార్కెట్లు, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, క్రీడా ప్రాంగణాలతో గ్రామాలు సమగ్ర అభివృద్ధి సాధించాయి.
మౌలిక వసతులు, సంక్షేమంతో పాటు వైద్య సేవల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ నగరానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ నిర్మాణంతోపాటు వరంగల్ నగరంలో 2,110 బెడ్లతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణాన్ని చేపట్టింది. వరంగల్ నగరాన్ని హెల్త్ సిటీగా తీర్చిదిద్దే ప్రక్రియను ముందుకు నడిపించింది. రూ.1200 కోట్లతో ఈ హాస్పిటల్ను నిర్మిస్తున్నది. కేసీఆర్ కిట్, ఆరోగ్యశ్రీ, శిశు మరణాల నియంత్రణ, కంటి వెలుగు పథకాలతో ప్రజా ఆరోగ్యంలో తెలంగాణ ప్రభుత్వం ముందున్నది. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా జిల్లాలను ఏర్పాటు కేసీఆర్ ప్రభుత్వం దీనికి అనుగుణంగా ప్రతి జిల్లా కేంద్రంలో సమీకృత కలెక్టరేట్ భవనాన్ని నిర్మించింది. హనుమకొండ, జనగామ, భువనగిరి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పరిపాలన భవనాల నిర్మాణం పూర్తయ్యింది. ఒక్కో జిల్లాలో రూ.1650 కోట్లతో ఈ భవనాలను నిర్మించింది. అభివృద్ధిలో కీలకమైన రోడ్ల నిర్మాణం, అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. ప్రతి జిల్లా కేంద్రం నుంచి మండలకేంద్రానికి డబుల్ లైన్ రోడ్లను, మండలకేంద్రం నుంచి ప్రతి గ్రామానికి రోడ్లను అభివృద్ధి చేసిం ది. ప్రతి ఊరిలోనూ అంత ర్గత రోడ్లను అభివృద్ధి చేసింది. ప్రతి వీధిలోనూ సీసీరోడ్లు నిర్మించింది. గ్రామ పంచాతీయలకు భవనాలను నిర్మించింది. పల్లెలు పచ్చగా ఉండేందుకు అనుగుణంగా ప్రతి ఊరికి ఒక ట్రాక్టర్ను సమకూర్చింది. నర్సరీలను ఏర్పాటు చేసింది. మొక్కల పెంపకం, సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది.
కేసముద్రం: కేసీఆర్ సర్కారు సాగు నీటికి ఢోకా లేకుండా చేసి రైతు గోస తీర్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నీరు లేక, కరెంట్ లేక రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడింది. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినంక మిషన్ కాకతీయ ద్వారా చెరువులను బలోపేతం చేసి నీటి నిల్వ సామర్థ్యం పెంచింది. గోదావరిపై కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి కాల్వల ద్వారా నీటిని విడుదల చేయడంతో వేసవిలోనూ చెరువుల్లో మస్తు నీళ్లున్నయ్. దీంతో బోర్లు, బావుల్లో భూగర్భ జలాలు పెరిగినయ్. ఎవుసానికి 24 గంటల విద్యుత్ ఇచ్చి, నీరు పుష్కలంగా ఉండడంతో రైతులు ఏడాదికి రెండు, మూడు పంటలు పండించిన్రు. సాగు విస్తీర్ణం పెరగడంతో గ్రామాల్లో కూలీలకు పని దొరికింది. ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసి నీటి వసతి పెంచడంతో రైతులు పంటలు మంచిగా పండించి ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు. రాష్ట్రంలో వర్షపాతం తగ్గినప్పటికీ నీటి సమస్య లేకపోవడంతో ధాన్యం దిగుబడి అధికంగా వచ్చింది.
– కూన భద్రాద్రి, రైతు, కల్వల