వరంగల్, మే 9(నమస్తేతెలంగాణ) : దుగ్గొండి మండల ప్రజల చిరకాల కోరిక తీరబోతున్నది. దుగ్గొండి-గిర్నిబావి రోడ్డు డబుల్ కాబోతున్నది. డబుల్ రోడ్డు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.15 కోట్లు కేటాయించింది. ఈ మేరకు కొద్దిరోజుల క్రితం పరిపాలనా అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రహదారుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. ఈ నేపథ్యంలో రహదారులు, భవనాల శాఖతో పాటు పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగాల ఆధీనంలో ఉన్న రహదారులన్నింటినీ అభివృద్ధి చేస్తున్నది. సింగిల్గా ఉన్న రోడ్లను డబుల్ రోడ్లుగా విస్తరిస్తున్నది. గ్రామాల్లోని అంతర్గత రహదారులను కూడా అభివృద్ధి చేస్తున్నది. ప్రధానంగా నర్సంపేట శాసనసభ నియోజకవర్గం పరిధిలో భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లను మరమ్మతు చేసేందుకు ఇటీవల ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు కేటాయించింది. తాజాగా దుగ్గొండి- గిర్నిబావి రోడ్డు అభివృద్ధికి సైతం నిధులు మంజూరు చేసింది. దుగ్గొండి నుంచి వరంగల్- నర్సంపేట ప్రధాన రహదారిలోని గిర్నిబావి గ్రామం వరకు ఎనిమిది కిలోమీటర్ల నిడివి గల ఈ రోడ్డు ప్రస్తుతం సింగిల్ రహదారి. 3.75 మీటర్ల వెడల్పుతో ఉన్న దుగ్గొండి- గిర్నిబావి బీటీ రోడ్డును ఏడు మీటర్ల డబుల్ రోడ్డుగా నిర్మించేందుకు ఆర్అండ్బీ ఇంజినీర్లు ప్రతిపాదనలు రూపొందించారు. రూ.15 కోట్లతో అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి పంపారు.
నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి చొరవ తీసుకున్నారు. సింగిల్ రోడ్డుతో ప్రజలు ఇబ్బంది పడుతుండడాన్ని గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఆర్అండ్బీ ఇంజినీర్ల అంచనాలకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. రూ.15 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. దీంతో మండల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిధుల మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే పెద్దికి కృతజ్ఞతలు తెలిపారు. పరిపాలన అనుమతి రావడంతో రోడ్డు పనులను చేపట్టేందుకు ఆర్అండ్బీ అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. సాంకేతిక అనుమతులను పొంది ఒకటి రెండు రోజుల్లో టెండర్ల ప్రక్రియ చేపట్టేందుకు తలమునకలయ్యారు. సాధ్యమైనంత త్వరలో పనులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే దుగ్గొండి నుంచి నల్లబెల్లి మండలంలోని నందిగామ మీదుగా ములుగు మండలంలోని మహ్మద్గౌస్పల్లి గ్రామం వరకు డబుల్ రోడ్డు ఉంది. దీంతో పాటు దుగ్గొండి నుంచి నల్లబెల్లి మీదుగా శనిగరం గ్రామం వరకు మెరుగైన రహదారి సౌకర్యం ఉంది. ఈ డబుల్ రోడ్డు నిర్మాణం జరిగితే దుగ్గొండి నుంచి వరంగల్-నర్సంపేట ప్రధాన రహదారి వరకు రోడ్డు అభివృద్ధి చెందనుంది. దీంతో దుగ్గొండి నుంచి గిర్నిబావి మీదుగా నర్సంపేటకు, జిల్లా కేంద్రానికి చేరుకోవడానికి ఈ రోడ్డు ఎంతో ఉపయోగపడనుంది.