వరంగల్, నవంబర్ 7(నమస్తేతెలంగాణ) : సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ(ఐడీవోసీ) నిర్మాణం చురుగ్గా సాగుతున్నది. సాధ్యమైనంత త్వరలో ఫౌండేషన్ పనులను పూర్తి చేయాలనే పట్టుదలతో అధికారులు ముందుకు వెళ్తున్నారు. వరంగల్లో నర్సంపేట రోడ్డులోని ఆజంజాహీ మిల్స్ గ్రౌండ్ స్థలంలో ఐడీవోసీ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం సుమారు 18 ఎకరాల భూమి కేటాయించింది. నిర్మాణ పనులకు గత జూన్ 17న రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు. ఐడీవోసీతో పాటు కలెక్టర్, అదనపు కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారుల క్వార్టర్ల నిర్మాణం కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.80 కోట్లు మంజూరు చేసింది. ఆర్అండ్బీ శాఖ టెండర్ల ప్రక్రియ నిర్వహించింది. గౌరీశంకర్ ఇన్ఫ్రా టెండర్ దక్కించుకుంది. నిర్మాణ స్థలంలో ఆర్అండ్బీ ఇంజినీర్లు మట్టి నమూనాలు సేకరించారు. పరీక్షల అనంతరం డిజైన్పై ఒక నిర్ణయానికి వచ్చారు. పద్దెనిమిది నెలల్లో ఈ పనులను పూర్తి చేయడానికి గౌరీశంకర్ ఇన్ఫ్రా సంస్థ అగ్రిమెంట్ చేసుకుంది. ఇటీవల లెవలింగ్తో పాటు తమ సంస్థ కార్యాలయాల నిర్వహణ, ఇంజినీర్లు, లేబర్ ఉండేందుకు రేకులతో తాత్కాలిక షెడ్లు నిర్మించింది. కరెంటు, నీటి సరఫరా, డ్రైనేజీ వంటి కనీస వసతులను ప్రభుత్వం కల్పించింది. ఐడీవోసీ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో ఆర్అండ్బీ ఇంజినీర్లు పర్యవేక్షిస్తున్నారు.
ఇతర జిల్లాల్లో నిర్మించిన ఐడీవోసీల మాదిరిగానే వరంగల్ ఐడీవోసీ నిర్మాణం కోసం ఆర్అండ్బీ ఇంజినీర్లు జీ ప్లస్ టూతో డిజైన్ చేశారు. 1.50 లక్షల చదరపు అడుగులతో డిజైన్ రూపొందించారు. కొత్తగా ఏర్పడిన వరంగల్ జిల్లా కేంద్రంలో ఏ ప్రభుత్వ శాఖకు సొంత భవనం లేదని, అన్ని కార్యాలయాలు ప్రస్తుతం హనుమకొండలో కొనసాగుతున్నందున ఇక్కడ జీ ప్లస్ టూతో నిర్మిస్తే ఐడీవోసీ సరిపోదని ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. దీంతో వరంగల్ ఐడీవోసీని జీ ప్లస్ త్రీ లేదా ఫోర్తో నిర్మించాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఈ ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉన్నది. దీనికి అనుగుణంగా నిర్మాణ పనులు చేపట్టారు. ఐడీవోసీ పక్కన కలెక్టర్ కోసం ఒకటి, ఇద్దరు అదనపు కలెక్టర్ల కోసం రెండు క్వార్టర్లు వేర్వేరుగా, ఎనిమిది మంది జిల్లా స్థాయి అధికారుల కోసం జీ ప్లస్ వన్తో రెండు క్వార్టర్లు (ఒక్కో క్వార్టర్లో నలుగురు ఉండేలా) నిర్మించేందుకు ఆర్అండ్బీ ఇంజినీర్లు డిజైన్ చేశారు. నిర్దేశిత గడువులోగా నిర్మాణ పనులను పూర్తి చేసే పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తున్నారు.