నర్సంపేట రూరల్, ఏప్రిల్ 4: పేదల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం కొండంత భరోసా ఇస్తోంది. ఇందులో భాగంగా విస్తృత వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటోంది. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో నర్సంపేటలోని ఏరియా ఆస్పత్రిని ఇటీవల అప్గ్రేడ్ చేశారు. సీఎం కేసీఆర్ సహకారం, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి కృషితో జిల్లా స్థాయి ఆస్పత్రి మంజూరైంది. 250 పడకల జిల్లా స్థాయి ఆస్పత్రి నిర్మాణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.66 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈనిధులతో నర్సంపేట-కొత్తగూడ ప్రధాన రహదారి సర్వాపురం శివారు దామెర చెరువు సమీపంలో జిల్లా స్థాయి నూతన ఆస్పత్రి నిర్మాణం చేపట్టారు. ఇప్పటికే దవాఖానలో వైద్యులు, ఇతర సిబ్బంది నియామకం కోసం 184 పోస్టులు మంజూయ్యాయి.
10 ఎకరాల్లో నిర్మాణ పనులు…
దవాఖాన నిర్మాణం కోసం రెవెన్యూ అధికారులు 10 ఎకరాల సువిశాల స్థలాన్ని కేటాయించారు. ఈమేరకు భూమి పత్రాలను నర్సంపేట సివిల్ ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ గోపాల్కు ఇప్పటికే అందించారు. గతంలో ప్రభుత్వ సివిల్ ఆస్పత్రిలో 50 పడకలు మాత్రమే ఉండగా.. దానిని 250 పడకల జిల్లా ఆస్పత్రిగా ప్రభుత్వం అప్గ్రేడ్ చేసింది.
మంత్రుల చేతుల మీదుగా శంకుస్థాపన
రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, స్త్రీ, శిశు సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్తో పాటు మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డి, బస్వరాజు సారయ్య, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, అప్పటి కలెక్టర్ డాక్టర్ గోపి, జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి తదితరులు 2022 మార్చి 5న ఆస్పత్రికి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా మరో రూ. 12 కోట్లతో చేపట్టిన నూతన టీ-డయాగ్నోస్టిక్ హబ్కు మంత్రులు శంకుస్థాపన చేశారు. వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, తెలంగాణ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల సంస్థ ద్వారా ఆస్పత్రి, టీ-డయాగ్నోస్టిక్ హబ్ను నిర్మించనున్నారు.
తొలగనున్న కష్టాలు..
జిల్లా స్థాయి ఆస్పత్రి నిర్మాణంతో ప్రజల ఇబ్బందులు ఇక తొలగనున్నాయి. వార్డుల వారీగా సేవలు అందుబాటులోకి వస్తాయి. నూతన డయాగ్నోస్టిక్ సెంటర్ ఏర్పాటు చేయడం వల్ల అన్ని విభాగాలకు చెందిన అత్యాధునిక ల్యాబొరేటరీ అందుబాటులో ఉంటుంది. వైద్య సిబ్బంది సంఖ్య పెరగడం వల్ల పేదలు మెరుగైన వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.
చురుగ్గా నిర్మాణ పనులు…
ఆస్పత్రి భవన నిర్మాణ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. బీహార్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ తదితర ప్రాంతాల కార్మికులు భవన నిర్మాణ పనుల్లో నిమగ్నమయ్యారు. ఎమ్మెల్యే పెద్ది నిర్మాణ పనులను పరిశీలిస్తూ పలు సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా ఆస్పత్రి నిర్మాణాన్ని 3 బ్లాక్లుగా విభజించారు. ప్రస్తుతం సీ-బ్లాక్, ఏ-బ్లాక్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. బీ-బ్లాక్ భవన నిర్మాణ పనులు మాత్రం బెడ్లెవల్ వరకు వచ్చాయి.
అందుబాటులోకి మెరుగైన సేవలు
జిల్లాస్థాయి ఆస్పత్రి నిర్మాణంతో ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి వస్తుంది. నర్సంపేట నియోజకవర్గ ప్రజలతో పాటు జిల్లాలోని పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించేందుకు ఆస్పత్రిని ఏర్పాటు చేస్తున్నాం. ఆస్పత్రి నిర్మాణ పనులు ప్రస్తుతం యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. అధునాతన భవనంతో పాటు పరికరాలను ఏర్పాటు చేసి ప్రజలకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తాం. త్వరలోనే పనులు పూర్తి చేయించి ప్రజలకు వైద్య సేవలందిస్తాం.
– పెద్ది సుదర్శన్రెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే