కాజీపేట, జూన్ 14 : కాజీపేట జూబ్లీమార్కెట్ సమీపంలోని జాతీయ రహదారిపై కల్వర్టుల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నేషనల్ హైవే, ఆర్అండ్బీ, కార్పొరేషన్కు చెందిన సుమారు మూడు కోట్ల రూపాయల వ్యయంతో బాపూజీనగర్-కాజీపేట చౌరస్తా, చౌరస్తా-బాపూజీనగర్ మధ్యలోని జూబ్లీమార్కెట్ వద్ద ఎన్హెచ్పై కల్వర్టు పనులు చకచకా కొనసాగుతున్నాయి. బాపూజీనగర్ -చౌరస్తా మధ్యలోని కల్వర్టు పనులను ఇటీవలే కాంట్రాక్టర్ వేగంగా పూర్తి చేయించారు. అలాగే, చౌరస్తా నుంచి బాపూజీనగర్ వైపు కల్వర్టు పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఈ జాతీయ రహదారి నగరానికి ముఖ ద్వారం కావడంతో నిత్యం వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. మడికొండ నుంచి నగరం వైపు, కాజీపేట చౌరస్తా నుంచి హైదరాబాద్ వైపునకు రాకపోకలతో నిత్యం రద్దీగా ఉంటుంది.
అయితే, వర్షం పడితే ఈ రహదారి మీదుగా వచ్చిపోయే వారు తీవ్ర ఇబ్బందు పడేవారు. ముఖ్యంగా జూబ్లీమార్కెట్ సమీపంలో దాదాపు మూడు దశాబ్దాల క్రితం నిర్మించిన డ్రైనేజీ కల్వర్టు ఇరుకుగా మారడంతో వర్షానికి నీరంతా రోడ్డుపై నిలిచిపోతోంది. రోడ్డుకు పక్కన ఉన్న దుకాణాలు, ఇండ్లలోకి వర్షం నీరు చేరుతోంది. గతంలో రహదారి విస్తరణలో రోడ్డు ఎత్తు పెంచడంతో ఆ ప్రాంతమంతా ప్రస్తుతం లోతట్టుగా మారింది. ఆ రోడ్డు మీదుగా రాకపోకలు సాగించే ప్రతి ఒక్కరూ వర్షం నీటితో ఇబ్బందులు పడేవారు. దీంతో కల్వర్టు నిర్మిణానికి చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ చొరవ తీసుకుని ఎన్హెచ్, ఆర్అండ్బీ అధికారులు ఒప్పించి ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు మంజూరు చేయించారు. ప్రస్తుతం జూబ్లీమార్కెట్ వద్ద ఎన్హెచ్పై ఇరువైపులా భారీ కల్వర్టుల నిర్మాణ పనులు చేపట్టడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రోడ్డు పక్కన చర్చి నుంచి ఫుట్వేర్ వరకు బాక్స్ డ్రైనేజీ పనులను కూడా చేపట్టనున్నారు. జూబ్లీ మార్కెట్ ప్రాంతంలో దాదాపు మూడు దశాబ్దాల సమస్య పరిష్కారం కావడంతో స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వానికి ధన్యవాదాలు
గతంలో వర్షం పడితే మార్కెట్ ప్రాంతంలో నీరంతా ఆగిపోయి ఇండ్లలోకి వచ్చి చేరేది. దీంతో చాలా ఇబ్బందిగా ఉండేది. ఇండ్ల ముందు చిన్న డ్రైనేజీ నిర్మించినప్పటికీ చిన్న కల్వర్టు ద్వారా నీరు వెళ్లకుండా నిలిచిపోయేది. దశాబ్దాల క్రితం నిర్మించిన కల్వర్టు స్థానంలో ఇప్పుడు విశాలంగా కల్వర్టు నిర్మించడంతోపాటు చర్చి నుంచి ఫుట్వేర్ వరకు బాక్స్ డ్రైనేజీలను ఏర్పాటు చేస్తుండడంతో కష్టం తీరనుంది. ఏండ్ల నాటి సమస్యను బీఆర్ఎస్ ప్రభుత్వం, చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ పరిష్కరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు.
– దేవరకొండ ఉపేందర్, వ్యాపారి
మూడు దశాబ్దాల సమస్య తీరుతోంది
మూడు దశాబ్దాలుగా జూబ్లీమార్కెట్ వాసులు, జాతీయ రహదారిపై రాకపోకలు సాగించేవారు ఎదుర్కొంటున్న సమస్య చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ నేతృత్వంలో తీరుతున్నందుకు బీఆర్ఎస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. వర్షం పడితే ఇండ్లలోకి నీరంతా వచ్చి దుకాణంలోని సామానులు తడిసి పోయేవి. రోడ్డు మీదుగా రాకపోకలు సాగించే ప్రతి ఒక్కరూ ఇబ్బందులు పడుతుండే. ఈ ప్రాంతం నుంచి వెళ్లాలంటే మోకాళ్ల లోతు నీటి నుంచి వెళ్లాల్సి వచ్చేది. ఈ సమస్యను పరిష్కరించాలని మూడు దశాబ్దాలుగా ఏ ప్రభుత్వానికి విన్నవించుకున్నా పట్టించుకోలే. ఎమ్మెల్యే వినయ్భాస్కర్కు స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి సమస్యను విన్నవించాం. వెంటనే ఆయన స్పందించి, ఎన్హెచ్ అధికారులు, ఆర్అండ్బీ అధికారులను ఒప్పించి సమస్యకు పరిష్కారం చూపారు.
– బెరదికోట రంజిత్కుమార్, స్థానికుడు