హనుమకొండ
హంటర్రోడ్డులోని కాకతీయ జూపార్కులో వన్యప్రాణుల రక్షణకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జంతువులు, పక్షులు ఎండ వేడిని తట్టుకునేందుకు కూలర్లు, స్ప్రింక్లర్లు, తట్టు సంచులు, తడకల పందిర్లు, గ్రీన్నెట్స్ ఏర్పాటు చేశారు. చల్లని వాతావరణం కల్పిచేందుకు షెడ్లపై రోజూ నీళ్లు చల్లడంతో పాటు మూగజీవాలకు ఇచ్చే ఆహారంలోనూ మార్పులు చేశారు.
– హనుమకొండ, మే 13
హనుమకొండ, మే 13 : వారం క్రితం వరకు వానలు, మబ్బులతో కాస్తా చల్లని వాతావరణమే ఉన్నా.. నాలుగైదు రోజుల నుంచి ఎండలు దంచికొడుతూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న వేడితో ఇటు మనుషులతో పాటు అటు మూగ జీవాలూ ఇబ్బందిపడుతున్నాయి. ఈ క్రమంలో హనుమకొండ హంటర్రోడ్డులోని కాకతీయ జూపార్కులో వన్య ప్రాణులకు ఎండవేడిమి నుంచి ఉపశమనం కలిగించేందుకు అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. జంతువులు, పక్షుల అవసరాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. భానుడి ప్రతాపాన్ని తట్టుకునేందుకు కూలర్లు, గ్రీన్నెట్స్, తడక పందిర్లు, స్ప్రింక్లర్లు వినియోగిస్తున్నారు. ఎప్పటికప్పుడు షెడ్లపై నీటిని జల్లుతున్నారు. రోజువారీగా అందించే ఆహారంతో పాటు మెనూలో కొన్ని మార్పులు చేశారు. డీ హైడ్రేషన్కు గురికాకుండా నీళ్లు, ఆహారంలో ఎలక్ట్రోల్ పౌడర్, గ్లూకోజ్, మల్టీ విటమిన్ బిల్లలు, సిరప్లు కలుపుతున్నారు.
ప్రత్యేకంగా తడకలపై వేసిన గ్రీన్నెట్స్ను గంట గంటకు నీటితో తడుపుతున్నారు. కొన్ని పక్షుల పందిర్లకు తట్టు సంచులు ఏర్పాటు చేశారు. మొసళ్లు, ఆస్ట్రిచ్, ఇతర జంతువులు, వివిధ రకాల పక్షులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసి రోజూ పర్యవేక్షిస్తున్నారు. యాజమాన్య పద్ధతులు పాటిస్తూ, ఆహారంలో మార్పుల ద్వారా ఎండ వేడిని తట్టుకునే శక్తిని జంతువులు, పక్షులకు అందించే చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి ఎన్క్లోజర్ చుట్టుపక్కల కూడా పీచు, తడకలు కట్టి గంటగంటకు నీటిని చిలకరిస్తున్నారు. చిరుత పులి ఎన్క్లోజర్లో ప్రత్యేకంగా కూలర్ అమర్చారు. స్ప్రింక్లర్లు ఏర్పాటు చేశారు. ఎలుగుబంటి ఎన్క్లోజర్లో వాటర్ గన్తో నీటిని చిలకరించి చల్లబరుస్తున్నారు. మూషిక జింకలకు గ్రీన్ నెట్ పరిచి ప్రతి రెండు గంటలకోసారి నీటితో తడుపుతున్నారు. నైట్ షెల్టర్లలోనూ కూలర్లు ఏర్పాటు చేశారు. జింకలు నీటిలో తడిసేలా ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. పార్కు ఆవరణలో విరివిగా చెట్లు పెంచడం మూలంగా బయటి ఉష్ణోగ్రతతో పోలిస్తే ఇక్కడ వేడి కాస్త తక్కువ గా ఉందని అధికారులు చెబుతున్నారు.
మెనూలో మార్పు
ఎండకాలం దృష్ట్యా జూపార్కులోని అన్నిరకాల జంతువులు, పక్షులకు ఇచ్చే ఆహార పద్ధతుల్లో మార్పులు చేశారు. నీటిలో ఎలక్ట్రోల్ పౌడర్, దాణాలో ఖనిజ లవణ మిశ్రమాలను రోజూ కలుపుతున్నారు. శాఖాహార జంతువులకు ఉప్పు గడ్డలను చెట్లకు కట్టి అందిస్తున్నారు. మాంసాహార జంతువులకు రోజువారీ ఆహారంతో పాటు పుచ్చకాయలు, కర్బూజాలు అందిస్తున్నారు.
వేడి తగలకుండా చూస్తున్నం
ఎండ తీవ్రత పెరుగుతున్న కారణంగా జూ లో సంరక్షణ చర్యలు తీసుకుటున్నం. జంతువులు, పక్షులు డీ హైడ్రేషన్ బారిన పడకుండా వాటి ఎన్క్లోజర్స్, షెడ్స్లో చల్లని వాతావరణం కల్పిస్తున్నం. మెనూలోనూ మార్పులు చేసినం. జంతువులకు ఇచ్చే నీటిలో ఎలక్ట్రోల్ పౌడర్, గ్లూకోజ్, ఆహారంలో ఖనిజ లవణ మిశ్రమం, మల్టీ విటమిన్ బిల్లలు, సిరప్ను రోజూ అందిస్తున్నం. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పరిస్థితులను అంచనావేసి తగు చర్యలు తీసుకుంటున్నం.
– డాక్టర్ చందుపట్ల ప్రవీణ్కుమార్, జూపార్క్ వైద్యుడు