వాల్మీకి మహర్షి జన్మస్థలమైన వల్మిడిలో రూ.50 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సీతారామచంద్రస్వామి ఆలయాన్ని వచ్చే నెల 4న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అదే రోజు పాలకుర్తిలోని సోమనాథ కళాక్షేత్రాన్ని ప్రజలకు అంకితం చేసి, రూ.25 కోట్లతో నిర్మించే హరిత కాకతీయ హోటల్కు భూమి పూజ చేయనున్నారు. ఈ కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా త్రిదండి చినజీయర్స్వామి, అతిథులుగా మంత్రులు టీ హరీశ్రావు, ఇంద్రకరణ్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, సత్యవతిరాథోడ్ హాజరుకానున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. సీతారామచంద్రస్వామి ఆలయ పనులు పూర్తయిన నేపథ్యంలో బుధవారం కలెక్టర్ సీహెచ్ శివలింగయ్యతో కలిసి పరిశీలించారు. ఆలయ పరిసరాల్లో విద్యుత్ దీపాల అలంకరణ, పార్కింగ్, మరుగుదొడ్లు, హెల్ప్ డెస్క్ సెంటర్లు, మెడికల్ క్యాంప్ను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం పర్యటనను విజయవంతం చేయాలని ఆయన కోరారు.
పాలకుర్తి రూరల్, ఆగస్టు 30 : వల్మిడి సీతారామచంద్రస్వామి ఆలయాన్ని ఈ నెల 4న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారని.. ఈమేరకు ఈ నెల 1 నుంచి మొదలయ్యే ప్రతిష్ఠాపన ఉత్సవాలు అదిరిపోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరాల శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కోరారు. పాలకుర్తి ప్రాంతమంటే ముఖ్యమంత్రికి ఎంతో అభిమానమని, మహాకవులు నడయాడిన నేల వల్మిడికి వచ్చే నెల 4న మధ్యాహ్నం ఒంటి గంటకు సీఎం కేసీఆర్ రానున్నారని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. ఈమేరకు బుధవారం వల్మిడిలోని ఆలయ గుట్టపై సీఎం రాక ఏర్పాట్లు, ఆలయ పర్యాటక పనుల పురోగతిపై అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ సీఎం కేసీఆర్, త్రిదండి చినజీయర్ స్వామి చేతుల మీదుగా ఆలయ ప్రారంభోత్సవం, విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు హరీశ్రావు, అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, సత్యవతిరాథోడ్, వి శ్రీనివాస్గౌడ్లు అతిథులుగా హాజరవుతారని చెప్పారు. చినజీయర్ స్వామి, సీఎం కేసీఆర్ చేతుల మీదుగా వల్మిడి ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కనుల పండువగా, అత్యంత వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. గుట్టపైన కొత్తగా నిర్మించిన ఆలయాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారన్నారు. ఈ ఉత్సవాలు సెప్టెంబర్ 1 నుంచి 4వ తేదీ వరకు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తామన్నారు.
వల్మిడి ఆలయ పర్యాటక పనులను రూ.50కోట్లతో చేపట్టామన్నారు. వల్మిడిని మరో భద్రాద్రిగా తీర్చిదిద్దామన్నారు. దక్షిణ అయోధ్యగా వల్మిడి ప్రసిద్ధి చెందుతుందని చెప్పారు. అలాగే పాల్కురికి సోమనాథుడి విగ్రహావిష్కరణ, కల్యాణమండప పనులను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని చెప్పారు. రూ.25కోట్లతో మంజూరైన హరిత కాకతీయ హోటల్ పనులకు సీఎం భూమిపూజ చేస్తారని మంత్రి వివరించారు. ఈ నెల 31లోగా పనులన్నీ పూర్తి చేసి సీఎం కేసీఆర్ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ అలంకరణ, పరిసరాల పరిశుభ్రత, పార్కింగ్, మరుగుదొడ్లు, హెల్ప్డెస్క్ సెంటర్లు, మెడికల్ క్యాంప్లు, సౌండ్ సిస్టంలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. భక్తులకు బస్సు సౌకర్యం కల్పించాలని, ఆలయ ప్రారంభోత్సవం, విగ్రహాల ప్రతిష్ఠాపనకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి సీఎం పర్యటనను విజయవంతం చేయాలన్నారు. వల్మిడిలో వేద పాఠశాల, గుట్టపై రోప్వే, కల్యాణ మండపం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని చెప్పారు.
దాతల సహకారం అభినందనీయం
ఉత్సవాలను పురస్కరించుకొని దాతలు సాయం చేయడం అభినందనీయమన్నారు. బీఆర్ఎస్ యువజన నాయకుడు ఈరెంటి సాయికృష్ణ రూ.3లక్షలు, వర్రె వెంకన్న 5లక్షలు, ఐబీ డీఈ శ్రీకాంత్ శర్మ రూ.3లక్షలు, గోపాలపురం గ్రామవాసి, కాంట్రాక్టర్ కోసన వెంకటనర్సింహారెడ్డి రూ.15లక్షలు, వివేరా హోటల్ అధినేత వెంకట్రెడ్డి, కాంట్రాక్టర్ కోడూరు నర్సింహారెడ్డి భక్తులకు ఉచిత భోజన వసతి సౌకర్యం కల్పించడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ యువజన నేత బబ్బూరి శ్రీకాంత్గౌడ్ ఏర్పాటుచేసిన ప్రచార రథాన్ని మంత్రి, కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య, అదనపు కలెక్టర్ రోహిత్సింగ్లు ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ దేవాలయ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని అధికారులు బాధ్యతతో పని చేయాలని సూచించారు. అనంతరం సీఎం పర్యటన కోసం హెలిప్యాడ్ స్థలాలను పరిశీలించారు. అదనపు కలెక్టర్లు రోహిత్ సింగ్, వి సుహాసిని, డీపీఓ రంగాచారి, ఆర్డీఓ వాసం రామ్మూర్తి, జడ్పీ సీఈఓ అనిల్కుమార్, డీఆర్డీఓ గూడూరు రాంరెడ్డి, ఆలయ కాంట్రాక్టర్ కోడూరు నర్సింహారెడ్డి, ఎస్ఈ తంగెళ్ల వేణుమాధవ్, జిల్లా వైద్యాధికారి ప్రశాంత్, డీఏఓ వినోద్కుమార్, సీపీఓ ఇస్మాయిల్, డీఎస్ఓ మేఘావత్ రోజారాణి, సీడీపీఓ జయంతి, జిల్లా బీసీ సంక్షేమశాఖాధికారి రవీందర్, దేవస్థాన కమిటీ చైర్మన్ వీరమల్ల జైహింద్, ఉప సర్పంచ్ నీరటి సోమన్న, పూజారి మధు, సైదులు, బీఆర్ఎస్ దేవరుప్పుల మండల అధ్యక్షుడు తీగల దయాకర్, నాయకుడు కారుపోతుల వేణు పాల్గొన్నారు.