జనగామ, ఏప్రిల్ 21(నమస్తే తెలంగాణ) : పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ను చిత్తుగా ఓడించి బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి మారెపల్లి సుధీర్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి పిలుపునిచ్చారు. ఊసరవెల్లి సైతం సిగ్గుపడేలా రాజకీయాల్లో రంగులు మార్చే కడియం శ్రీహరికి బుద్ధి చెప్పాలంటే కాంగ్రెస్ అభ్యర్థి కావ్యను చిత్తుగా ఓడించాలన్నారు. ఆదివారం జనగామలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటుచేసిన సన్నాహక సమావేశంలో మాజీ ఎమ్మెల్యే, స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గ ఇన్చార్జి తాటికొండ రాజయ్యతో కలిసి పల్లా హాజరై మాట్లాడారు. కడియం శ్రీహరికి దమ్ముంటే ముందు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా, ఎంపీగా, డిప్యూటీ సీఎంగా అనేక పదవులు అనుభవించిన ఆయన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను మోసం చేసి కాంగ్రెస్ పంచన చేరారని విమర్శించారు. సోమవారం వరంగల్ అభ్యర్థి సుధీర్కుమార్ నామినేషన్ దాఖలు చేయనున్నందున స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు హాజరుకావాలని పల్లా పిలుపునిచ్చారు.
నమ్ముకున్న వారిని మోసం చేయడంలో కడియం శ్రీహరిని మించిన వారు మరొకరు లేరని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మండిపడ్డారు. కేసీఆర్ దయతో ఎన్నో పదవులు అనుభవించి, కారు గుర్తుపై పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన కడియం శ్రీహరి అధికార దాహంతో కాంగ్రెస్లో చేరి ఆయననే వెన్నుపోటు పొడిచాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో దళిత ద్రోహి కడియం శ్రీహరి కూతురిని ఓడగొట్టాలనే కసితో ప్రజలు ఉన్నారన్నారు. నాలుగు నెలల క్రితం కారు గుర్తుతో గ్రామాల్లోకి వచ్చిన ద్రోహి ఇప్పుడు మరో పార్టీ గుర్తుతో గ్రామాల్లోకి వస్తున్నారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు ఎడవెల్లి కృష్ణారెడ్డి పాల్గొన్నారు.