హనుమకొండ, మార్చి 5: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ ఉచితం చేస్తామని చెప్పిన కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి రాగానే మాట తప్పారని కుడా మాజీ చైర్మన్లు మర్రి యాదవరెడ్డి, సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్ అన్నారు. మంగళవారం బాలసముద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో వారు మాట్లాడారు. కేసీఆర్ సర్కార్ ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణకు మార్గదర్శకాలు రూపొందించినప్పుడు అప్పటి సీఎల్పీ నేత భట్టి విక్రమార ఎల్ఆర్ఎస్ కోసం ప్రజలు డబ్బులు కట్టొద్దని, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను దోచుకోవడానికే ఈ కార్యక్రమం చేపట్టిందని విమర్శించారని గుర్తుచేశారు.
ఇప్పుడు అధికారంలోకి రాగానే మాట మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్చి 31లోగా ఎల్ఆర్ఎస్ కట్టుకోవాలని ప్రకటన చేయడం విడ్డూరంగా ఉందన్నారు. గత ప్రభుత్వ హయాంలో దరఖాస్తు చేసుకున్న 25 లక్షల 44 వేల మంది రూ. వెయ్యి కట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, ఇప్పుడు వారిపై భారం మోపి రూ. 20 వేల కోట్లు దోచుకునేందుకు కాంగ్రెస్ సిద్ధమైందని విమర్శించారు. మాట నిలుపోకుంటే ప్రజల పక్షాన ఉద్యమం చేస్తామ ని హెచ్చరించారు. అందులో భాగంగా బుధవారం హనుమకొండ ఏకశిల పారు వద్ద ధర్నా చేపడుతున్నట్లు తెలిపారు. సమావేశంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కో ఆర్డినేటర్ పులి రజినీకాంత్, కార్పొరేటర్ అశోక్, నాయకులు ఎన్ రమేశ్, జే రమేశ్, ఎం రమేశ్, జానకీరాములు, పరశురాం, మనోజ్, రఘు, కనకరాజు, సీహెచ్.రమేశ్, శ్రీకర్, శ్రీధర్, సదాంత్, శ్రీకాంత్, కృష్ణ, అఫ్జల్, వినయ్ పాల్గొన్నారు.