ఐనవోలు, నవంబర్ 18 : ‘కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వలేదని, కేసీఆర్ నాయకత్వంలో కొట్లాడి తెలంగాణ సాధించుకున్నామని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. శనివారం మండలంలోని వెంకటాపురంలో ఎన్నిక ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రకటించి వెంటనే తెలంగాణ ఇస్తే మన బిడ్డలు చనిపోయేవారు కాదని, జాప్యం చేశారు కాబట్టే వందలాది మంది అత్మబలిదానాలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మన బిడ్డల ఆత్మబలిదానాలకు కాంగ్రెస్ నాయకులే సమాధానం చెప్పాలన్నారు. కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ల్యాండ్పూలింగ్ చేయనివ్వమని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఒక్క అవకాశం ఇచ్చి ఎమ్మెల్యే గా గెలిపించండి. మీరు కోరిన పనులన్నింటినీ ఆరు నెలల్లో పూర్తి చేస్తానన్నారు. నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీకి ఎన్నికల మీదే యావ ఉన్నదని, పేద ప్రజల కోసం పథకాలను కొనసాగించాలనే అలోచన లేదన్నారు.
రైతుబంధు, దళిత బంధు, రైతు రుణ మాఫీతో పేదలకు లబ్ధి జరుగుతుంటే ఆ పార్టీలు ఓర్వలేక పోతున్నాయని విమర్శించారు. ఈ పథకాలను ఆపాలని కాంగ్రెస్, బీజేపీ నాయకులు చూస్తున్నారని, ప్రజలే ఆలోచన చేయాలన్నారు. ఎన్నికలు వచ్చిన్నప్పుడు మాత్రమే వారికి ప్రజలు గుర్తుకు వస్తాయని, బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఈ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని నిలదీయాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు రాష్ట్ర సంపదను పెంచి ప్రజలకు పంచాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు. మ్యానిఫెస్టోలో రాబోయే 5 ఏళ్లలో రైతుబంధును రూ.16వేలు, ఆసరా పింఛన్ రూ.5 వేలు, మహిళలకు సౌభాగ్య లక్ష్మి పథకం ద్వారా నెలకు రూ.3 వేలు, రూ.400లకే ప్రతి ఇంటికీ గ్యాస్ సిలిండర్ ఇస్తామని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మాదాసు వెంకటేశ్, జడ్పీటీసీ బేబీ శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ కర్ణాకర్, మండలాధ్యక్షుడు జైపాల్రెడ్డి, ఎంపీపీ మార్నేని మధుమతి, ఎంపీటీసీ పిండి మాధవి, సర్పంచ్ గోరె రేణుక, గ్రామ అధ్యక్షుడు రామారావు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.