తొర్రూరు, ఫిబ్రవరి 7 : మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లడగడానికి వచ్చే కాంగ్రెస్ నాయకులను వారి దొంగ హామీలపై నిలదీయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం తొర్రూరులోని 16 వార్డుల్లోని బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. 2000 బైక్లతో పాలకేంద్రం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ ప్రారంభించారు. అనంతరం ఎర్రబెల్లి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో 420 హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఎందుకు అమలు చేయలేదన్నారు. పేదల కోసం గోపాలగిరి రోడ్డులో 280 డబుల్ బెడ్ రూమ్లు నిర్మిస్తే వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేయకుండా కాలయాపన చేస్తుందన్నారు. ఇండ్ల కోసం పోరాటం చేసిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.
బీఆర్ఎస్ పాలనలోనే తొర్రూరు మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. ఇందిరమ్మ చీరెల విషయంలో కమీషన్ల కకుర్తితో మహిళా సంఘాల పేరుతో సుమారు రూ.450 కోట్ల రుణాల్లో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేయడంలో దేశంలోనే నంబర్వన్గా మారిందని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి గుణపాఠం తప్పదని ఎర్రబెల్లి పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ మేనిఫెస్టోలో లేని ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల మన్ననలు పొందారని తెలిపారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.