ములుగు రూరల్, జూలై 15 : ములుగు జిల్లాలో పుష్ప సినిమాను తలపించే రీతిలో ఇసుక దందా కొనసాగుతుందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, రాష్ట్ర రెడ్కో మాజీ చైర్మన్ వై సతీశ్రెడ్డి అన్నారు. బుధవారం ములుగు జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ భవన్లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టి రెండున్నరేళ్లు గడుస్తున్నా ప్రజలను పట్టించుకోకుండా పాలనకు గాలికి వదిలేసిందన్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని రైతులు, ప్రజలను మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు పట్టించుకోకుం డా దోచుకోవడమే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇటీవల శాస్త్రవేత్తలు కరువు వచ్చే అవకాశం ఉందని చెప్పినప్పటికీ రేవంత్రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదన్నారు. గోదావరి నదిలో రోజుకు లక్ష క్యూసెక్క్యుల నీరు ఆంధ్రా ప్రాంతానికి తరలిపోతున్నా సీఎం పట్టించుకోవడం లేదని తెలిపారు.
మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావు నీటి వినియోగంపై మాట్లాడిన వెంటనే ప్రభుత్వం అప్రమత్తమై మోటర్లను ఆన్ చేసి నీటిని వదిలారన్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే 3 నుంచి 4లక్షల ఎకరాల సాగును నష్టపోయారని తెలిపారు. రైతుల సమస్యలను, ప్రజల కష్టాలను, ప్రభుత్వ దవాఖానలను గాలికి వదిలివేసి ఇసుక దందాలో దోచుకోవడమే ధ్యేయంగా పనిచేస్తున్నారన్నారు. ఇసుక లారీల కారణంగా ఇప్పటి వరకు ములుగు జిల్లాలో సుమారు 50 మంది చనిపోయారని, వారి కుటుంబాలను ఏనాడు స్థానిక మంత్రి పరామర్శించలేదన్నారు. డిస్టిలేషన్ పేరుతో గోదావరి నదిలో 4వేల కోట్ల ఇసుక దందా కుంభకోణానికి మంత్రులు సీతక్క, పొంగులేటి తెర లేపారన్నారు.
ఈ విషయమై హైకోర్టులో కేసు నడుస్తున్నదని, త్వరలో ఇసుక విక్రయాలు జరపకుండా కోర్టు నుంచి ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందన్నారు. బీఆర్ఎస్ తరపున ఇసుక దందాపై కలెక్టర్కు ఫిర్యాదు చేసిన అనంతరం మణుగూరులో మంత్రులు ఇసుక కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించి మంతనాలు చేశారన్నారు. గిరిజన సొసైటీలను తాను డబ్బులు అడిగానని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టారని మండిపడ్డారు.
తాను తప్పు చేసినట్లు ఆధారాలు ఉంటే చూపించాలని సవాల్ విసిరారు. మంత్రులు, కాంగ్రెస్ నాయకులు ఇసుక దందా కోసం దొంగ సర్టిఫికెట్ స్పష్టించి డీఎఫ్వో సంతకాన్ని ఫోర్జరీ చేసి 4వేల కోట్ల ఇసుక దందాకు తెరలేపలేదని ప్రమాణాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారా అని చాలెంజ్ చేశారు. గోవిందరావుపేట మండలంలో ఎస్సీ కులానికి చెందిన ఓ వ్యక్తికి అధికారులు బీసీ సర్టిఫికెట్ మంజూరు చేశారని, దాం తో అతను బీసీ కార్పొరేషన్లో రుణం కోసం దరఖాస్తు చేసుకున్నాడని, ఇది ఇలా సాధ్యమని ప్రశ్నించారు. జిల్లాలో ఇసుక దందాతో పాటు దొంగ సర్టిఫికెట్ల దందా జరుగుతుందని ఆరోపించారు. కొన్ని రోజుల క్రితం ఏటూరునాగారం పోలీస్ స్టేషన్కు ఓ పంచాయితీ విషయంలో పెద్దమనిషిగా వెళ్లి న వ్యక్తిని కాంగ్రెస్ నాయకులు కావాలని పోలీస్ స్టేషన్లో మొద్దుకు వే యించారని ఆరోపించారు.
పోలీసులు మొద్దుకు వేసి ఫొటోలు తీసి కాంగ్రె స్ నాయకులకు పంపించడం అమానుషమైన చర్య అన్నారు. ప్రభుత్వ తప్పులను సోషల్ మీడియాలో పోస్టు చేసిన వ్యక్తిని పస్రా పోలీసులు రాత్రంతా స్టేషన్లో కూర్చోబెట్టి వేధించారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పా ర్టీది శాశ్వత అధికారం కాదని, రానున్న రెండేళ్లలో తిరిగి కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడు తుందని, ఈ విషయాన్ని పోలీస్, రెవెన్యూ అధికారులు గు ర్తుంచుకోవాలని హెచ్చరించారు. నకిలీ కులం సర్టిఫికెట్ అందజేసిన తహసీల్దార్తో పాటు రెవెన్యూ అధికారులపై జిల్లా కలెక్టర్ తగిన చర్యలు తీసుకోవాలని సతీశ్రెడ్డి కోరారు. సీనియర్ నాయకులు మల్క రమేశ్, సానికొమ్ము రమేశ్రెడ్డి, చెన్న విజయ్, బైకాని సాగర్, నూనవత్ మహేశ్నాయక్, ఆకుతోట చంద్రమౌళి, గొర్రె సమ్మయ్య, గరిగె రఘు ఉన్నారు.