మడికొండ, జూన్ 5: కాజీపేట పట్టణం వైఎస్సా ర్ నగర్లోని పేదల భూమిని కబ్జా చేసేందుకు కొం దరు కాంగ్రెస్ నేతలు కుట్రలు చేస్తున్నారని మాజీ కార్పొరేటర్ సంకు నర్సింగరావు, బీఆర్ఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి నార్లగిరి రమేశ్, సీనియర్ నాయకులు శివకుమార్, తండమల్ల వేణు ఆరోపించారు. శుక్రవారం కాజీపేటలోని మీడియా పాయింట్లో వారు మాట్లాడారు. కాంగ్రెస్కు చెందిన మాజీ కార్పొరేటర్ వైఎస్సార్నగర్ గుడిసెవాసులను బెదిరించి ఆ స్థలాన్ని బలవంతంగా ఖాళీ చేయించాలని చూస్తున్నట్లు చెప్పారు.
సర్వే నంబర్లు 68, 69, 70, 71, 72లో సుమారు 20 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా అన్యాక్రాంతమవడంతో ప్రస్తు తం తొమ్మిది ఎకరాలు మాత్రమే ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ భూమి విలువ సుమారు రూ.300 కోట్లు ఉంటుందన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ ఐటీఐ, జూనియర్ కళాశాల లేదా దవాఖాన, ప్రజా రక్షణ నిమిత్తం ఏసీపీ ఆఫీస్, బస్టాండ్, చిరు వ్యా పారుల సముదాయం వంటివి నిర్మించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ స్థలాలను పరిరక్షించేందుకు 1982 నుంచి ఉద్యమాలు జరిగాయని గుర్తు చేశారు. గత టీడీపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఈ స్థలాన్ని పేదల ఇండ్లకు కేటాయించినట్లు పేర్కొన్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి ఆదేశాలతో మాజీ కార్పొరేటర్ ఈ భూమిని కబ్జా చేయాలని చూస్తున్నారని స్థానికులు చర్చించుకుంటున్నట్లు తెలిపారు.
స్థలం ఖాళీ చేయించేందుకు రూ.40 కోట్ల డీల్ మాట్లాడుకున్నట్లు కూడా ప్రచారం జరుగుతున్నదన్నారు. కాజీపేట రైల్వే హబ్గా మారనుందని, అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే ఈ స్థలాన్ని సమీకృత భవనాల నిర్మాణానికి వినియోగించాలన్నారు. ఖమ్మం జిల్లాలోని వెలుగుమెట్లలో పేదల ఇండ్లు కూల్చినట్లుగానే కాజీపేటలోనూ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. దీనిపై ఎమ్మెల్యే నాయిని వైఖరి ఏమిటో స్పష్టంగా తెలియజేయాలని డిమాండ్ చేశారు. నాయకులు కాటాపూర్ రాజు, మర్యాల కృష్ణ, దువ్వ కనకరాజు, బెదరకోట రంజిత్, ఎస్కే మహమూద్, సారంగపాణి, అఫ్జల్, దశరథం, కుమార్, రాజ్కుమార్, కిట్టు, రాంచందర్, శేఖర్, కొండ్ర శంకర్ పాల్గొన్నారు.