పరకాల, అక్టోబర్ 26 : ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ గడ్డను దోచుకున్న కాంగ్రెస్ పార్టీని, తెలంగాణ రాష్ట్రంపై విషం కక్కుతున్న బీజేపీని బొందపెట్టాలని బీఆర్ఎస్ పరకాల అభ్యర్థి, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చల్లా మాట్లాడుతూ తెలంగాణ రాష్ర్టాన్ని సుభిక్షంగా పాలిస్తున్నది సీఎం కేసీఆరే అని అన్నారు. ఆయన పాలనలో గడపగడపకూ సంక్షేమ ఫలాలు పారదర్శకంగా అందుతున్నాయన్నారు. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. తెలంగాణ ప్రజల సంతోషాన్ని జీర్ణించుకోలేని విపక్ష పార్టీలు కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే కర్ణాటక మోడల్ అమలు చేస్తామంటున్న కాంగ్రెస్ నాయకులు.. ఆ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడవక ముందే ఇచ్చిన హామీల అమలులో చేతులెత్తేశారని ఎద్దేవా చేశారు. దీంతో అక్కడి రైతులు మన రాష్ట్రంలోని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి నియోజకరవ్గంలో బీఆర్ఎస్కు సానుకూలంగా ప్రచారం చేస్తున్నారన్నారు. తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలు కాకుండా కాంగ్రెస్ నాయకులు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తున్నారన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ 60 ఏండ్లు వెనక్కి వెళ్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నదన్నారు. అసలు ఆ పార్టీకే గ్యారెంటీ లేదన్నారు. 24 గంటల కరెంటు ఇచ్చే బీఆర్ఎస్ కావాలో, మూడు గంటల కరెంటు చాలు అంటున్న కాంగ్రెస్ కావాలో తెలంగాణ ప్రజలు ఆలోచించాలన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను ఆపుతున్న కాంగ్రెస్ నాయకులను తరిమి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంపై విషం కక్కుతున్న బీజేపీని, తెలంగాణను దోచుకున్న కాంగ్రెస్ పార్టీని తెలంగాణ గడ్డపై బొందపెట్టాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మడికొండ శ్రీను, సమన్వయ కమిటీ సభ్యులు నిప్పాని సత్యనారాయణ, నేతాని శ్రీనివాస్ రెడ్డి, పావుశెట్టి వెంకటేశ్వర్లు, చందుపట్ల రమణారెడ్డి, వైస్ ఎంపీపీ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చింతిరెడ్డి మధుసూదన్రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ బండి సారంగపాణి, మున్సిపల్ వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్రెడ్డి, కౌన్సిలర్ ఏకు రాజు, బీఆర్ఎస్ నాయకులు మేరుగు శ్రీశైలం, పంచగిరి శ్రీనివాస్, దుంపేటి నాగరాజు, నక్క చిరంజీవి, శాతరాసి సనత్ పాల్గొన్నారు.