న్యూఢిల్లీ, జూలై 25: విద్యార్థులు, యువత ఒత్తిడికి తలొగ్గి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం కేవలం ఒక మంత్రి పదవి కోల్పోయిన ఘటన మాత్రమే కాదు. గత 12 ఏండ్లలో భారీ ప్రజా ఉద్యమాల ఒత్తిడితో మోదీ ప్రభుత్వం వెనక్కి తగ్గిన మూడో సందర్భం ఇది. మీ టూ ఉద్యమం నేపథ్యంలో మాజీ కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ రాజీనామాను కూడా పరిగణనలోకి తీసుకుంటే ప్రజా ఒత్తిడికి కేంద్ర మంత్రివర్గంలోని మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చిన రెండో ఘటన ఇదే.
ఈ మూడు ఘటనలు కూడా మోదీ ప్రభుత్వం అధికారం, ప్రజాస్వామ్య చట్టబద్ధత, భిన్నాభిప్రాయాలను ఎలా చూస్తుందనే అంశంపై కీలక సంకేతాలను ఇస్తున్నాయి. ఈ ప్రభుత్వ వ్యవహారశైలిలో ఒక స్పష్టమైన నమూనా కనిపిస్తుంది. సాధ్యమైనంత కాలం వరకు నిరసనలను ప్రతిఘటించడం, వాటి నైతిక బలాన్ని తక్కువ చేసి చూపడం, చివరకు అధికారాన్ని నిలబెట్టుకోవడం వల్ల కలిగే రాజకీయ నష్టం వెనక్కి తగ్గడం వల్ల కలిగే నష్టాన్ని మించిపోతుందని భావించినప్పుడు మాత్రమే నిర్ణయం మార్చుకోవడం.
మొదటి ప్రధాన వెనకడుగు పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) వ్యతిరేక ఉద్యమం సందర్భంగా కనిపించింది. అప్పటివరకు దేశవ్యాప్తంగా అమలు చేయాలని భావించిన జాతీయ పౌరుల నమోదు(ఎన్ఆర్సీ) అంశంపై ప్రభుత్వం తన వైఖరిని మెత్తబరిచింది. సాంకేతికంగా చూస్తే ఇది క్యాబినెట్ నిర్ణయాన్ని అధికారికంగా వెనక్కి తీసుకోవడం కాదు. ఎందుకంటే దేశ్యాప్తంగా ఎన్ఆర్సీ అమలుకు ఎలాంటి అధికారిక నోటిఫికేషన్ జారీ కాలేదు. అయితే రాజకీయంగా చూస్తే ప్రభుత్వం వెనక్కి తగ్గిందనే సందేశం స్పష్టంగా వెళ్లింది.
రెండో పెద్ద వెనకడుగు రైతుల ఉద్యమం సందర్భంగా కనిపించింది. దాదాపు ఏడాది పాటు నిరసనలు కొనసాగిన తర్వాత ప్రభుత్వం చివరకు మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసి రైతులకు క్షమాపణ చెప్పడం వెనకడుగుగా నిలిచింది.
నీట్ యూజీ ప్రశ్నపత్రం లీకేజ్పై జెన్ జీ ఉద్యమానికి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర రాజీనామా చేయాల్సి వచ్చింది. ఉద్యమంలో పాల్గొన్న వారి స్వభావంలో, ఉద్యమం సాగిన విధానం అన్నీ ఆదర్శంగా ఉన్నాయి. బీజేపీ ప్లాన్లు ఇక్కడ పారలేదు.