బేగంపేట్ జూలై 25: అందరి సమన్వయంతో 200 సంవత్సరాల చరిత్ర కలిగిన ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతరను ఘనంగా జరుపుకుందామని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ పిలుపునిచ్చారు. ఆగస్టు 2న జరిగే సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతర నిర్వహణ, ఏర్పాట్లపై ఆలయం వద్ద వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ముందుగా ఆలయ పరిసరాలలో అధికారులతో కలిసి పర్యటించి ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు, దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తారని చెప్పారు. భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అధికారులు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం అదనపు పోలీసు సిబ్బందిని నియమించాలన్నారు. ఆగస్టు 2, 3వ తేదీలలో సాయంత్రం ఫలహారపు బండ్లు ఊరేగింపు పూర్తయ్యే వరకు ట్రాఫిక్ డైవర్షన్ చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ అధికారులకు చెప్పారు.
విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా అదనపు ట్రాన్స్ ఫార్మర్స్, జనరేటర్స్ అందుబాటులో ఉంచుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. అమ్మవారికి బోనాలు తీసుకువచ్చే వారికి, శివసత్తులకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయాలన్నారు. పారిశ్యుధ్య కార్మికులను అధిక సంఖ్యలో ఏర్పాటు చేయాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా బోనాల ఉత్సవాలు జరుపుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఈవో మనోహార్రెడ్డి, ఏసీపీ శ్రీధర్, జోనల్ కమిషనర్ మంగతాయారు తదితరులు పాల్గొన్నారు.
అమ్మవారి చీర నేత పనులు ప్రారంభం
ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర సందర్భంగా సమర్పించే చీర తయారీ పనులను శనివారం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ ప్రారంభించారు. ఆయల ప్రాంగణంలోనే ఏర్పాటు చేసిన మగ్గానికి ప్రత్యేక పూజలు చేసి పనులను ప్రారంభించారు.