ధర్మసాగర్, అక్టోబర్ 30 : దేశం మొత్తంగా ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలను ఒక్క తెలంగాణలోనే సీఎం కేసీఆర్ నాయకత్వంలో అమలు చేస్తున్నామని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మె ల్సీ, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి అన్నారు. ధర్మసాగర్ మండలం నర్సింగరావుపల్లె, ఎలుకుర్తి, శాయిపేట గ్రామాల్లో సోమవారం బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా కడియం శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామా ల్లో ఆయనకు డప్పు చప్పుళ్లుతో, కోలాట నృత్యాలతో స్థానికులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశాల్లో కడియం శ్రీహరి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలతో పేదలు ఆర్థికాభివృద్ధి చెందుతున్నారన్నారు. ప్రత్యేక రా ష్ట్రం కోసం జరిగిన పోరాటంలో కాంగ్రెస్ సకాలంలో తెలంగాణ ఇచ్చి ఉంటే చాలా మంది ప్రాణాలు పోకుండా ఉండేవన్నారు. సాధించుకున్న రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. రైతుల కోసం సీఎం కేసీఆర్ ఉచితంగా 24గంటల కరెంటు ఇస్తున్నారన్నారు. అలాగే, పెట్టుబడి సాయం అందజేస్తున్నారన్నారు. రైతు బీమా అమలు చేస్తున్నట్లు తెలిపారు.
కేంద్రం సహకరించకపోయినా ప్రతి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంతే కాకుండా దివ్యాంగులు, వృద్ధ్దులకు ప్రతి నెల రూ.4016, 2016 పింఛన్ ఇస్తున్నట్లు తెలిపారు. ఇలా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి తెలంగాణ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ఎన్నికల ప్రచారం కోసం గ్రామాలకు వచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు నమ్మి ప్రజలు మోస పోవద్దన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత ప్రాంతా ల్లో అమలు చేయని పథకాలు ఇక్కడ ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. రాష్టం సాధించిన తర్వాత కేసీఆర్ పాలనలో ఎక్కడా కరంటు కోసం, విత్తనాల కోసం, ఎరువుల కోసం రైతులు ధర్నాలు చేయలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక రాష్ట్రంలో రైతులకు ఐదు గంటలు కరంటు ఇస్తున్నామని స్వయంగా ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం వెల్లడించారని గుర్తు చేశారు. అలాంటి పార్టీ అధికారంలోనికి వస్తే తెలంగాణలో రైతులకు కరెంటు కష్టాలు మళ్లీ వస్తాయని హెచ్చరించారు. కాంగ్రెస్కు ఓటు వేస్తే తొమ్మిదేళ్లు వెనక్కి వెళ్లాల్సి వస్తుందన్నారు. ప్రజలందరు గ్రహించి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. మూడో సారి సీఎంగా కేసీఆర్ను గెలిపించాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోనికి వస్తే రైతులకు పెట్టుబడి సహాయం కింద ఎకరానికి రూ.16వేలు, ఇండ్ల నిర్మాణం కోసం రూ.3లక్షలు, పింఛన్లు ఐదేళ్లలో రూ.5016, తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకు నెల రూ.3వేలు, కేసీఆర్ ఆరోగ్య బీమా పథకం ద్వారా రూ.5లక్షల బీమా, వైద్య ఖర్చుల నిమిత్తం రూ.15లక్షలు, దళిత బంధు పథకంలో రూ.10లక్షలు రూ.400లకే గ్యాస్ ఇలా సంక్షేమ పథకాలకు పెద్దపీట వేయనున్నట్లు తెలిపారు. తనను మీ ఎమ్మెల్యేగా గెలిపించి, నిండు మనస్సుతో ఆశీర్వాదించాలని కోరారు. గ్రామాల్లో ప్రగతిలో ఉన్న పనులు సమస్యలను పరిష్కరించి, ఇంకా అభివృద్ధి పనులను చేయిస్తానన్నారు. సమావేశంలో డీసీసీబీ జిల్లా డైరెక్టర్ రాజేశ్వర్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు మునిగెల రాజు ముదిరాజ్, జడ్పీటీసీ డా. పిట్టల శ్రీలత, సర్పంచ్లు మదాసి అరుణ, మామిడి రవీందర్ యాదవ్, శోభ, వైస్ ఎంపీపీ రవీందర్, వైస్ చైర్మన్ యాదకుమార్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు రమేశ్, మండల రైతు కోఆర్డినేటర్ కరుణాకర్, నాయకులు రంగారావు, చాడ నర్సింహారెడ్డి, తోట నాగరాజు, రాంరెడ్డి, సత్యనారాయణ, వెంకట్రాజం, శేఖర్, యాదగిరి, రాజు, మధుకర్, కుమార్, రమేశ్, మహిళలు పాల్గొన్నారు.
మండల కేంద్రానికి చెందిన సర్పంచ్ ఎర్రబెల్లి శరత్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు మాజీ సర్పంచ్ కునూర్ రాజు, 2వ వార్డు సభ్యుడు ఎరుగొండ సాంబరాజు, చల్లా రాజిరెడ్డి, కొట్టె సురేశ్తో పాటుగా పలువురు సోమవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరందరికి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే అభ్యర్థి కడియం శ్రీహరి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు చాడ కుమార్, ప్రభుదాస్, ప్రదీప్, వాసు, మల్లేశం, యాదగిరి, రాజయ్య యాదవ్, లాల్, రవీందర్, మాజీ ఎంపీపీ రఘు పాల్గొన్నారు.