నర్సంపేట, జూన్ 20 : బోనస్ లేదు.. కొనుగోళ్లు లేవు.. కేంద్ర ప్రభుత్వం చెబితేనే కొంటాం అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. శనివారం నర్సంపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ విస్మరించిందన్నారు. 33 రకాల సన్నాలను కాంగ్రెస్ సర్కారు ఏడుకు కుదించిందని, బోనస్ ఎగ్గొట్టేందుకు మరో కుట్ర పన్నిందని దుయ్యబట్టారు.
వరంగల్లో రాహుల్గాంధీ ప్రకటించిన డిక్లరేషన్లో అన్ని పంటలకు మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పుడు రేవంత్రెడ్డి బోనస్ లేదు, అన్ని పంటలను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయదు అని తేల్చి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రం కొన్నా, కొనకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే అన్ని రకాల పంటలను కొనుగోలు చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక నిర్ణయాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని, ఈ నిర్ణయాన్ని బేషరతుగా ఉపసంహరించుకోవాలన్నారు. యూరియా విషయంలో అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వాలు రైతులతో చెలగాటమాడుతున్నాయన్నారు.
ఇప్పటి వరకు రూ.1900ల కోట్ల బోనస్ ఎగ్గొట్టారని, మాజీ సీఎం కేసీఆర్ హయాంలో 11 విడతల్లో రూ.74వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశారని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం డీజిల్, ఎరువుల ధరలు పెంచి రైతు మీద భారం మోపుతున్నదని పెద్ది విమర్శించారు. సమావేశంలో నర్సంపేట నియోజకవర్గ కో-ఆర్డినేటర్ తక్కళ్లపెల్లి రవీందర్రావు, నాయకులు రాయిడి రవీందర్రెడ్డి, నాగెళ్లి వెంకటనారాయణగౌడ్, నల్లా మనోహర్రెడ్డి, నాడెం శాంతికుమార్, వేనుముద్దల శ్రీధర్రెడ్డి, గోనె యువరాజ్, నామాల సత్యనారాయణ, మండల శ్రీనివాస్, మోతె తిరుపతిరెడ్డి, పెండెం వెంకటేశ్వర్లు, పెండ్యాల యాదగిరి, సదానందం, నవీన్నాయక్, తదితరులు పాల్గొన్నారు.