జనగామ రూరల్, ఏప్రిల్ 12 : రైతులు సన్నధాన్యం పండిస్తే ప్రభుత్వ మద్దతు ధరతో పాటు క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఆచరణలో విఫలమైంది. ప్రస్తుతం యాసంగి సీజన్ ప్రారంభం కావడంతో జనగామ జిల్లాలోని ఆయా గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. గతంలో మద్దతు ధరతో పాటు, బోనస్ ఎంత ఇచ్చే విషయాన్ని కొనుగోలు కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన ప్లెక్సీల్లో పేర్కొన్నారు.
ఈసారి మాత్రం ఫ్లెక్సీల్లో సన్న ధాన్యానికి మద్దతు ధర పేర్కొన్నా బోనస్ విషయం లేదు. దీంతో ఈ యాసంగిలో సర్కార్ బోనస్ ఇవ్వదేమోనని రైతులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, అధికారులు స్పష్టత ఇవ్వకపోవడం అనుమానాలకు తావిస్తున్నది.