హనుమకొండ, మే 18 : కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని విస్మరించింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చేతులెత్తేసింది. రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేయడంతోపాటు సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని గొప్పగా ఊదరగొట్టిన కాంగ్రెస్ పార్టీ పెద్దలు.. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా మోసం చేశారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి ఇబ్బందిపడుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట పండించడం కంటే పంటను అమ్ముకోవడానికే ఎక్కువ కష్టాలు పడాల్సివస్తున్నదని రైతులు వాపోతున్నారు. ఎన్నికల ముందు అన్ని పంటలకు బోనస్ ఇస్తామని మాయమాటలు చెప్పి అధికారంలో వచ్చిన కాంగ్రెస్ సన్నాలకే ఇస్తామని మాట మార్చిందని రైతులు మండిపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2024-25 వానకాలం సీజన్ నుంచి బోనస్ ఇస్తామని ప్రకటించింది.
కానీ, ఒక సీజన్కు మాత్రమే పరిమితమైంది. గత యాసంగి సీజన్కు సంబంధించిన బోనస్ ఇప్పటి వరకు ఇవ్వలేదు. సన్నవడ్లు పండించి అమ్మిన రైతులు ఏడాది కాలంగా ఎదురు చూస్తున్నారు. అసలు ప్రభుత్వం బోనస్ ఇస్తుందా… ఇవ్వదా? అనేది ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వ ప్రకటనతో సన్నరకం వైపు మొగ్గు చూపిన రైతులకు సకాలంలో బోనస్ డబ్బులు రాకపోవడంతో ఇబ్బందిపడుతున్నారు. కాగా, ఈ వానకాలంలో ప్రభుత్వం సూచించిన 8 రకాలనే సాగు చేయాలని ఆంక్షలు విధించిందని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సివిల్ సప్లయ్ అధికారుల వివరాల ప్రకారం.. జిల్లాలో యాసంగి సీజన్లో కొనుగోలు చేసిన 29,990 మెట్రిక్ టన్నుల సన్నరకాలకు సంబంధించి బోనస్ మొత్తం రూ.15 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. ఈ ధాన్యాన్ని ఐకేపీ, పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాల ద్వారా 7,472 మంది రైతుల నుంచి సేకరించారు. అష్టకష్టాలు పడి సన్నరకాన్ని సాగు చేసిన రైతులు బోనస్ వస్తుందని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించారు. ప్రభుత్వ మద్దతు ధరతోపాటు అదనంగా క్వింటాలుకు రూ. 500 బోనస్ వస్తుందని ఆశపడిన రైతులు అంతా బోగస్ అని తేలడంతో లోలోన కుంగిపోతున్నారు. అంతేకాక ఈ యాసంగి సీజన్కు సంబంధించిన బోనస్పై కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడంపై మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం బోనస్ డబ్బులు చెల్లించాలని, లేని పక్షంలో అన్నదాతల ఆగ్రహానికి గురికావల్సి వస్తుందని హెచ్చరించారు.
రానున్న వానకాల సీజనల్లో ప్రభుత్వం సూచించిన ఎనిమిది రకాల సన్నాలను మాత్రమే సాగు చేయాలని ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుందని పలువురు రైతు మండిపడుతున్నారు. అనేక రకాలుగా సన్నాలు ఉన్నా కేవలం 8 రకాలనే ప్రమోషన్ చేస్తూ వ్యవసాయ శాఖ ప్రచారం చేయడంతో రైతుల్లో గందరగోళానికి గురవుతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా బోనస్ విషయంలో ఆంక్షలు పెడుతూ ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, వ్యవసాయ శాఖ బీపీటీ 5204(సోనామసూరి), తెలంగాణ సోనా(ఆర్ఎన్ఆర్- 15048), కేఎన్ఎం -1638, జై శ్రీరాం, హెచ్ఎంటీ(సోనా), డబ్ల్యూజీఎల్ -962, డబ్ల్యూజీఎల్ -44(సిద్ది), జేజీఎల్ -1798 రకాలు మాత్రమే సాగు ప్రభుత్వం పేర్కొన్నది.
సన్న ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం బోనస్ చెల్లిస్తుందన్న ఆశతో సాగు చేసిన. యాసంగిలో 40 క్వింటాళ్ల ధాన్యం పండింది. బోనస్ వస్తుందని కొనుగోలు చేసిన నిర్వాహకులు చెప్పి రసీదు ఇచ్చారు. కానీ, ఇప్పటి వరకు బోనస్ డబ్బులు పడలేదు. పడుతాయన్న ఆశ కూడా పోయింది రైతులకు ఆశ చూపి మోసం చేసిండ్లు.
– ఏశబోయిన కుమారస్వామి, రైతు నారాయణగిరి, ధర్మసాగర్ మండలం