తెలంగాణ జీవధార వద్దకు కదలివచ్చిన గులాబీ దండు.. ‘చలో మేడిగడ్డ’ పర్యటనను స్వాగతించిన రైతులు.. దారిపొడవునా రామన్నకు సాదర స్వాగతాలు
జయశంకర్ భూపాలపల్లి, మార్చి 1(నమస్తే తెలంగాణ) : కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలను ప్రజల ముందు బీఆర్ఎస్ బయటపెట్టింది. నాలుగు నెలల క్రితం మేడిగడ్డ బరాజ్లో ఒక ఫిల్లర్ కుంగగా కాంగ్రెస్ ప్రభుత్వం మరమ్మతులు చేయకుండా విచారణ పేరుతో జాప్యం చేస్తుండడంపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో రైతులు, ప్రజలకు నిజానిజాలు తెలియజేసేందుకు శుక్రవారం ‘కాళేశ్వరం యాత్ర’ చేపట్టగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు సహా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి మేడిగడ్డ, అన్నారం బరాజ్లను పరిశీలించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వానకాలంలోగా బరాజ్కు మరమ్మతులు చేసి రైతులకు నీళ్లందించి న్యాయం చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే బీఆర్ఎస్ను బద్నాం చేసేందుకు మేడిగడ్డ అంశాన్ని రాద్ధాంతం చేస్తున్నదని, కాళేశ్వరాన్ని నీటిపాలు చేసే కుట్రలు చేస్తున్నదని రైతులకు వివరించగా, అన్నారం బరాజ్ వద్ద బీఆర్ఎస్ బృందానికి, రైతులకు మాజీ మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే కడియం శ్రీహరి పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు.
బీఆర్ఎస్ బృందం మధ్యాహ్నం 2.30 గంటలకు భూపాలపల్లిలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయానికి చేరుకుంది. అక్కడ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి భోజన సౌకర్యం ఏర్పాటు చేయగా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్రావు, మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డితో పాటు ఇతర మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు భోజనం చేసి 3:25 గంటలకు మేడిగడ్డకు బయల్దేరారు. సుమారు 4.50 గంటలకు బీఆర్ఎస్ బృందం మేడిగడ్డకు చేరుకుంది. పోలీసులు బరాజ్లోనికి అనుమతించకపోవడంతో బీఆర్ఎస్ నేతలు ఒక్కసారిగా తోసుకుంటూ వెళ్లిపోయారు. బరాజ్లోకి దిగి కుంగిన ఫిల్లర్లతో పాటు ప్రతి ఫిల్లర్ను క్షుణ్ణంగా పరిశీలించారు. కేవలం మూడు, నాలుగు ఫిల్లర్లు మినహా ఇతర ఫిల్లర్లకు ఎలాంటి నష్టం జరుగలేదని నిర్ధారించారు. నాలుగు ఫిల్లర్లను తొలగించి మళ్లీ నిర్మిస్తే మేడిగడ్డ ప్రాజెక్టు ఉపయోగంలోకి వస్తుందని, ప్రస్తుతం ఇక్కడ కాఫర్ డ్యాం నిర్మించి రైతులకు నీరు అందించవచ్చని తేల్చి చెప్పారు. ఆ తర్వాత అక్కడినుంచి అన్నారం బరాజ్కు వెళ్లారు. బరాజ్లో ఏర్పడిన సీపేజ్లను పరిశీలించారు. చిన్న చిన్న సీపేజ్లు సాధారణమని, ప్రభుత్వం ప్రతి విషయాన్ని భూతద్దంలో చూపిస్తూ బీఆర్ఎస్ను బదనాం చేసి కాళేశ్వరాన్ని నీటిపాలు చేసే కుట్రలు చేస్తున్నదని అక్కడికి వచ్చిన రైతులకు వివరించారు. అనంతరం అన్నారం వద్ద ఏర్పాటు చేసిన వేదికపై కడియం శ్రీహరి, హరీశ్రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
చలో మేడిగడ్డ కార్యక్రమం పోలీసుల తీరుతో కొద్దిసేపు ఉద్రిక్తంగా మారింది. కేటీఆర్ బృందం వెళ్తున్న నేపథ్యంలో అక్కడికి చేరుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు బ్రిడ్జి మెయిన్ గేట్ మూసివేసి అనుమతించకపోవడంతో కార్యకర్తలు ఆందోళన చేశారు. మెయిన్ గేటు తీసుకొని బ్రిడ్జిపైకి వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈక్రమంలో కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. తొక్కిసలాటలో ఓ మహిళా కార్యకర్త కిందపడింది.
హైదరాబాద్ నుంచి కాళేశ్వరం యాత్రకు బయల్దేరిన బీఆర్ఎస్ బృందానికి దారిపొడవునా ప్రజలు, రైతులు సంఘీభావం ప్రకటించారు. భూపాలపల్లి నుంచి బయల్దేరిన బృందానికి భూపాలపల్లి, కాటారం, మహదేవపూర్, బెగులూరు తదితర గ్రామాల్లో రైతులు బీఆర్ఎస్ బృందానికి ఘనంగా స్వాగతం పలికారు. ప్రత్యేక బస్సులో వెళ్తున్న కేటీఆర్కు రైతులు, ప్రజలు పుష్పగుచ్ఛాలు అందించి నీరాజనం పట్టారు. కాగా యాత్రకు ఒక రోజు ముందుగానే గురువారం జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో రైతులు కాళేశ్వరం నీటిని వదలాలని, ఎండుతున్న తమ పంటలను కాపాడాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేసిన విషయం తెలిసిందే.