మడికొండ, నవంబర్ 15: మడికొండలో డంప్ యార్డు సమస్యను పరిష్కరిస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అరూరి రమేశ్ హామీ ఇచ్చారు. గ్రేటర్ 46, 64వ డివిజన్లలో బుధవారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. మడికొండలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వర్ధన్నపేట నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి రూ.కోట్లు పెట్టి బీఫారం తెచ్చుకున్నాడని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు విశ్వాసం లేదన్నారు. నియోజకవర్గంలో గతంలో ఏ పార్టీ చేయని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసినట్లు చెప్పారు. సమైక్య పాలనలో ముందస్తు ఆలోచన లేకుండా మడికొండకు ఎగువన డంపింగ్ యార్డు ఏర్పాటు చేయడం వల్ల చుట్టుపకల గ్రామాల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్లో సీఎం అభ్యర్థి ఎవరో తెలియని పరిస్థితి ఉందన్నారు. మంత్రి కేటీఆర్ చొరవతో డంపింగ్ యార్డులో శుద్ధిచేసే పనులు ప్రారంభించామని, పీపీపీ పద్ధతిలో ప్రక్షాళన చేసి పార్కును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
నియోజకవర్గంలో రూ.2,500 కోట్లతో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. మూడోసారి అధికారంలోకి వస్తే పేదలందరికీ సన్న బియ్యం పంపిణీ చేసేలా సీఎం కేసీఆర్ రూపకల్పన చేశారని చెప్పారు. రూ.10వేల నుంచి రూ.16వేల వరకు రైతుబంధు పెంచుతారని, రూ.1,250 ఉన్న గ్యాస్ సిలిండర్ను రూ.400కే అందించేలా మ్యానిఫెస్టోలో పొందుపరిచామన్నారు. అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ద్వారా యువతకు ఉపాధి అవకాశాల కోసం శిక్షణ ఇచ్చామని, కరోనా కాలంలో ఫౌండేషన్ ద్వారా బడుగు, బలహీన వర్గాలను ఆదుకున్నామని గుర్తుచేశారు. అంబేదర్ సాక్షిగా డంపింగ్యార్డును పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ ప్రజల మధ్య ఉండే అరూరి రమేశ్ను ఎన్నుకోవాలని కోరారు. విలీన గ్రామాలకు రూ.400కోట్లు తీసుకొచ్చి అభివృద్ధికి పెద్దపీట వేశారని చెప్పారు. స్మార్ట్ సిటీ నుంచి రూ.100కోట్ల నిధులు సైతం విలీన గ్రామాలకే కేటాయించారని తెలిపారు. ఇంటింటా ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అరూరి రమేశ్కు మహిళలు కోలాటం, మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలికారు. వృద్ధులు ఆప్యాయంగా పలుకరించారు. జిల్లా కోఆర్డినేటర్ ఎల్లావుల లలితాయాదవ్, కార్పొరేటర్లు ఆవాల రాధికరెడ్డి, మునిగాల సరోజన, డివిజన్ అధ్యక్షులు దువ్వ శ్రీకాంత్, బొల్లికొండ వినోద్కుమార్, దువ్వ నవీన్, పోలెపల్లి రామ్మూర్తి పాల్గొన్నారు.