శాయంపేట, అక్టోబర్ 26: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేస్తే మళ్లీ రాష్ట్రంలో చిమ్మచీకట్లేనని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మండలంలోని నర్సింహులపల్లి, గట్లకానిపర్తి, సూరంపేట, మాందారిపేట, గోవిందాపూర్, జోగంపల్లి, పెద్దకోడెపాక, కొప్పుల, వసంతాపూర్, గంగిరేణిగూడెం, సూర్యనాయక్తండా, రాజుపల్లి, కాట్రపల్లిలో బీఆర్ఎస్ ముఖ్య నేతలు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాలను గురువారం నిర్వహించారు. జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతితో కలిసి ఆయన సమావేశాల్లో పాల్గొన్నారు. మాందారిపేట, గోవిందాపూర్ గ్రామాల్లో ఎన్నికల ఇన్చార్జి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ కర్ణాటకలో మూడు గంటల కరెంటు ఇస్తే.. ఓ రైతు క్రిమిసంహారక మందు తాగాడని, అక్కడి అన్నదాతలు కాంగ్రెస్కు ఓటు వేయొద్దని కోరుతున్నారన్నారు. రైతుబంధు పథకాన్ని ఆపివేయాలని ఎన్నికల కమిషన్కు కాంగ్రెస్ ఫిర్యాదు చేసిందని, రైతులకు మంచి చేస్తే కళ్లు కుడుతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ గ్యారెంటీలపై ప్రజలు ప్రశ్నించాలని కోరారు. కర్ణాటకలో ఎందుకు అమలు చేయడం లేదో నిలదీయాలని పిలుపునిచ్చారు. తనను ఎమ్మెల్యేగా మరోసారి గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ గెలుపు కోసం మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారితో కలిసి తారతమ్య భేదం లేకుండా పని చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం నర్సింహులపల్లికి చెందిన బీజేపీ ఉపాధ్యక్షుడు పంజాల రమేశ్ బీఆర్ఎస్లో చేరారు. సమావేశాల్లో ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ మారెపల్లి నందం, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంగుల మనోహర్రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రం అశోక్, మాజీ వైస్ ఎంపీపీ వంగాల నారాయణరెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అన్నదాతలకు ఆర్థిక చేయూతనిస్తున్న రైతుబంధు పథకాన్ని ఆపివేయాలని రాబందు కాంగ్రెస్ నేతలు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడం సిగ్గుచేటని భూపాలపల్లి ఎన్నికల ఇన్చార్జి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అన్నారు. గోవిందాపూర్లో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతితో కలిసి సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ నేతలు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని సారయ్య విమర్శించారు. ఇలాంటి కుటిల మనస్తత్వం ఉన్న కాంగ్రెస్ పార్టీకి మాటలతో కాకుండా ఓటుతో బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. కారుగుర్తుకు ఓటువేసి మరోసారి సంక్షేమ సర్కారుకు పట్టం కట్టాలని కోరారు. ఎమ్మెల్యే గండ్రను గెలిపిస్తే నిత్యం ప్రజల మధ్యలో ఉండి సమస్యలు పరిష్కరిస్తారని, జీఎంఆర్ ట్రస్టు ద్వారా నిరుపేద యువతకు డ్రైవింగ్ లైసెన్స్లు ఇప్పించి ఉపాధి కల్పించారని గుర్తుచేశారు. గండ్ర మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన తనను మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. సమావేశంలో ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ మారెపల్లి నందం, ఎంపీటీసీ వావిలాల వేణు, సర్పంచ్ చిట్టిరెడ్డి రాజిరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంగుల మనోహర్రెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు గుర్రం రవీందర్, శ్రావణ్కుమార్, కుమారస్వామి పాల్గొన్నారు.